Rajya Sabha: రాజకీయాలలో పరిస్థితులు ఎప్పుడు ఏ విధంగా మారతాయో చెప్పడం అంచనా వేయడం చాలా కష్టం. రాజకీయాలు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు కూడా మారుతూ ఉంటారు. ఉదాహరణకు.. పార్టీలో ఉన్నంతసేపు ఆ పార్టీ అధ్యక్షుడు తమకి దేవుడు అంటూ భజన చేసేవారు ఒక్కసారిగా పార్టీ మారితే అదే అధ్యక్షుడు రాక్షసుడిగా మారుతాడు. ఈ క్రమంలోనే కొందరు రాజకీయ నాయకులు మితిమీరి శృతిమించి ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఒక పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి అదే పార్టీకి వ్యతిరేకంగా కూటమి కట్టిన శివసేనలోని ఎమ్మెల్యే సంజయ్ శీర్సత్ శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రేపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్ర ఎంపీ ప్రియాంక చతుర్వేదిపై ఎమ్మెల్యే సంజయ్ శీర్సత్ అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక అందాన్ని చూసి ఆదిత్య ఠాక్రే ఆమెకు రాజ్యసభలో స్థానం కల్పించారని అన్నారు. దాంతో సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ.. నేను ఎలా ఉన్నానో.. ఎక్కడ ఉన్నానో మీలాంటి వారు చెప్పాల్సిన అవసరం లేదు. మహిళల పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఇవి మహిళల హుందాను దిగజార్చే విధంగా ఉన్నాయి. వారి అభిప్రాయాలను గౌరవించండి అంటూ ఆమె ట్విట్ చేశారు.
అలాగే ఈ విషయంపై ఆదిత్య ఠాక్రే కూడా స్పందిస్తూ..
వక్రబుద్ధితో ఆలోచిస్తున్నారు. ఇలాంటి నీచమైన మనస్తత్వం గల వ్యక్తులు ఎలా రాజకీయాల్లో ఉన్నారో అర్ధం కావడం లేదు అంటూ ఆయన మండిపడ్డారు. దీనిపై ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ.. మాజీ ఎంపీ చంద్రకాంత్ జైరే గతంలో ప్రియాంక చతుర్వేది గురించి తనతో అన్న మాటలనే తాను ఇప్పుడు చెప్పానని వివరణ ఇచ్చారు.