Malaysia Open: భారత్ స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు మరోసారి అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. మలేషియన్ ఓపెన్లో తొలి మ్యాచ్లోనే ఓటమి పాలై ఇంటిదారి పట్టింది. ఎన్నో అంచనాలతో బరిలో దిగిన సింధు ఇలా ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇదే టోర్నీలో భారత క్రీడాకారులు హెచ్ఎస్ ప్రణయ్, సాత్విక్ జోడీ ప్రీక్వార్టర్స్లో అడుగు పెట్టడంతో అభిమానులకు ఊరట కలిగింది.
గతంలో కామన్వెల్త్ క్రీడల సమయంలో సింధు గాయపడింది. ఈ గాయం కారణంగా కొన్ని నెలలపాటు విశ్రాంతి తీసుకున్న ఆమె.. మలేషియా ఓపెన్లో తొలిసారి బరిలో దిగింది. ఈ మేరకు మహిళల సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్లో ఆరో సీడ్ పీవీ సింధు స్పెయిన్కు చెందిన కరోలినా మారిన్తో తలపడింది. అయితే ఈ మ్యాచ్లో 12-21, 21-10, 15-21 తేడాతో పీవీ సింధు ఓడిపోవడంతో ఇంటి దారి పట్టింది.
ఈ మ్యాచ్లో తొలి సెట్ను కోల్పోయినా రెండో సెట్లో పీవీ సింధు అద్భుతంగా ఆడింది. రెండో సెట్ను 21-10 తేడాతో గెలుచుకుంది. కానీ నిర్ణయాత్మక మూడో సెట్లో కరోలినా మారిన్ జోరు పెంచడంతో పీవీ సింధు వెనకడుగు వేసింది. దీంతో మూడో సెట్ను కూడా మారిన్ గెలుచుకోవడంతో పాటు మ్యాచ్లో విజయాన్ని సొంతం చేసుకుంది.
ఊరట కలిగించిన పురుషుల జోడీ
మహిళల సింగిల్స్లో పీవీ సింధు నిరాశను కలిగించగా పురుషుల సింగిల్స్లో ఇద్దరు భారత ఆటగాళ్ల మధ్య జరిగిన మ్యాచ్లో 22-24, 21-12, 21-18 తేడాతో ఏడో సీడ్ లక్ష్య సేన్ను ప్రణయ్ ఓడించాడు. అటు డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ.. కొరియాకు చెందిన చోయ్ సోల్ గ్యూ-కిమ్ వోన్ హోపై 21-16, 21-13తో ఘనవిజయం సాధించింది. కాగా సింధుతోపాటు మరో భారత క్రీడాకారిణి మాళవిక భన్సోడ్ కూడా ఓటమి చవిచూసింది. కొరియాకు చెందిన అన్ సి యంగ్ చేతిలో 9-21, 13-21 తేడాతో మాళవిక వరుస సెట్లను కోల్పోయి మ్యాచ్ను చేజార్చుకుంది.