Sri Kurma Gramam: నేటి యుగంలో ఫోన్ చూడకుండా ఒక పది నిమిషాలు కూడా ఉండలేము. అలాగే ఆధునిక జీవనశైలి అలవాటైన మనం పల్లెటూర్లో కనీసం పది రోజులు కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. అన్ని ఆధునిక సౌకర్యాలకి అలవాటు పడిన మన మనసు మన శరీరము ఆ వాతావరణాన్ని భరించలేవు. అయితే ఇందుకు భిన్నంగా పురాతన జీవనశైలిని ఆచరిస్తూ సెల్ ఫోన్లు , రింగ్ టోన్లు, టీవీలు ఆఖరికి కరెంటు కూడా ఉపయోగించకుండా సనాతన జీవితాన్ని గడుపుతున్న ఒక గ్రామం శ్రీకాకుళం జిల్లాలో ఉంది దాని పేరు కూర్మ.
ఇక్కడ ప్రజలు జీవించే జీవన విధానాన్ని చూస్తే నేటితరం ఎంతో ఆశ్చర్యానికి గురవుతుంది. ఇక్కడ ప్రతిదీ ప్రకృతి పరంగా వచ్చినదాన్నే అనుభవిస్తారు. తమకి కావలసిన నిత్యవసరాలు వాళ్లే సమకూర్చుకుంటారు. అంటే తాము పండించిన వడ్లను దంచుకోగా వచ్చిన బియ్యాన్ని వండుకు తింటారు. కావలసిన దుస్తులు వారే నేసుకుంటారు. అక్కడ ఇల్లు కూడా గానుగలో ఆడించిన సున్నంతో వారు స్వయంగా కట్టుకున్నవే. అక్కడ ఉన్న వారందరూ ఆధునిక జీవనశైలికి రోత పుట్టి సనాతన ధర్మమే వేదంగా ఆధ్యాత్మిక చింతనతో గడుపుతున్నారు.
శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో హిరమండలం మండల పరిధిలోని అంతకాపల్లి సమీపంలో కొండల మధ్య సరికొత్తగా కొలువుతీరిన గ్రామమే కూర్మ. 2018లో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సంస్థాపకాచార్యులైన భక్తి వేదాంత స్వామి ప్రభు పాదులు, వారి శిష్యులు ఈ గ్రామాన్ని నిర్మించారు. మొదట్లో చాలా కొద్దిమంది మాత్రమే నివసించేవారు కానీ ఇప్పుడు 12 కుటుంబాలు, 16 మంది గురుకుల విద్యార్థులు, ఆరుగురు బ్రహ్మచారులతో కలిసి మొత్తం 56 మంది నివసిస్తున్నారు.
వీరందరూ ఉన్నత చదువులు చదువుకున్న వారు, ఉన్నత శ్రేణి జీవన వర్గానికి చెందినవారు, లక్షలలో జీతాలు ఇచ్చే ఉద్యోగాలు వదులుకొని కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి నివాసం ఉంటున్నారు. వీరందరూ చెప్పేది ఏమిటంటే భగవంతుని సేవతోనే సంతృప్తి చెందగలుగుతాం, ఒక మంచి జీవితానికి ఎటువంటి టెక్నాలజీ అవసరం లేదని నిరూపిస్తాం. భారత జీవనశైలిలో పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం అంటూ అక్కడ ఉన్నవారు ఎంతో గర్వంగా చెప్తారు.