Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో పింక్ డైమండ్ దొంగలించారు. ఐదేళ్ల క్రితం వచ్చిన ఈ ఆరోపణలను ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే టీటీడీ అప్పటి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గత ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు ఇవి. చంద్రబాబు గత ఎన్నికల్లో ఓడిపోవడానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతారు. అయితే, ఆయన ఇప్పుడు కూడా అలాంటి ఆరోపణలే చేశారు. వైసీపీ ప్రభుత్వంపై, టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై పలు ఆరోపణలు చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆగమశాస్త్రం ప్రకారం ఏదీ జరగడం లేదని ఆరోపించారు. టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఓ క్రిస్టియన్ అని.. సీఎం జగన్ ఓ క్రిస్టియన్ అని మండిపడ్డారు. ధర్మారెడ్డి కుమారుడు చనిపోతే దహనం చేయకుండా ఖననం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మారెడ్డి బొట్టు కూడా పెట్టుకోరని.. ఆయన క్రిస్టియన్ అని చూస్తేనే అర్థం అవుతుందని విమర్శించారు.
దీంతో పాటు మరో విషయం కూడా కొత్తగా వెలుగులోకి వచ్చింది. అహోబిలంలో రెండు వందల సంవత్సరాల క్రితం కొండమీద గృహలోకి ఓ జియ్యర్ వెళ్లి సమాధి అయ్యాడట. ఆ గృహలో విజయనగర సామ్రాజ్యకాలంలో పెద్ద ఎత్తున నిధులు దాచారని ఓ ప్రచారం ఉంది. ఆ నిధులు రెండో జియ్యర్ కు దక్కాలని సమాధి అయిన మొదటి జియ్యర్ సంకల్పం చేశారని చెబుతూ ఉంటారు. అయితే, ఆ నిధుల కోసం టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. బెంగళూరులో ఉన్న ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో పురుషోత్తమరెడ్డి అనే అధికారి ధర్మారెడ్డికి బాగా కావాల్సిన వ్యక్తి అని రమణ దీక్షితులు అనుమానించారు.
అంతేకాదు.. తిరుమల తిరుపతి దేవస్థానంలో అడుగడుగునా ఆగమశాస్రానికి తూట్లు పొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిచెన్ లో అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నాయని.. ఎక్కడిక్కడ గుట్కాలు నమిలి పడేస్తారని విమర్శించారు. తిరుమల ఆలయంలో పరకామణిలో గ్రానైట్ తీసి నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారని మండిపడ్డారు. వెయ్యికాళ్ల మండపం కానీ.. దేవ మండపం కానీ.. అన్నీ నిధుల కోసమే తవ్వారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. ధర్శనానికి వచ్చిన జడ్జిలను, కేంద్రమంత్రులను, ఆడిటర్లను సాలువాలు కప్పి, ప్రసాధాలు పంచి మ్యానేజ్ చేస్తున్నాని విమర్శించారు.
అయితే, ఈ వీడియో వైరల్ కావడంతో రమణ దీక్షితులు యూ టర్న్ తీసుకున్నారు. ఈ వీడియోతో తనకు సంబంధం లేదని మండిపడ్డారు. అయితే, దీనిపై రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో వస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా రమణ దీక్షితులు వీడియో ఉందని మండిపడుతున్నారు. దీనిపై అమిత్ షాకు లేఖ రాశారు. సీబీఐ విచారణ జరపాలని కోరారు. మరి వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడలి.