Shahrukh Khan: బాలీవుడ్ సినిమాలు ఈ మధ్యకాలంలో కాస్త వివాదాల బారిన పడుతున్నాయి. తాజాగా స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమాపై కూడా కొన్ని రోజులుగా వివాదం నడుస్తూనే ఉంది. సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్గా చేసింది. పఠాన్ సినిమాకు సంబంధించి ఈ మధ్యకాలంలో ‘బేషరమ్ రంగ్’ అనే పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ఈ సాంగ్ లో హీరోయిన్ దీపికా పదుకొనె బికినీలో కనిపించడమే కాకుండా ఇందులో కొన్ని డ్యాన్స్ మూవ్మెంట్స్ కూడా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అయోధ్యకి చెందినటువంటి ఓ సాధువు అయితే షారుఖ్ ఖాన్ కనిపిస్తే ఆయన్ని సజీవ దహనం చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.
అయోధ్యకి చెందిన తపస్వి ఛావ్నీకి చెందిన మహంత్ పరమహంస ఆచార్య ఈ వ్యాఖ్యలు చేయడంతో అందరూ షాక్ అయ్యారు. మన సనాతన ధర్మానికి చెందిన ప్రజలు దీని గురించి నిరంతరం నిరసనలు చేస్తున్నారని, నేడు షారుఖ్ ఖాన్ పోస్టర్ను తగులబెట్టాం అని ఆ సాధువు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను జిహాదీ షారుఖ్ ఖాన్ను కలిసినట్లయితే, అతనిని సజీవ దహనం చేస్తానని కోపంతో ఊగిపోయాడు.
పఠాన్ సినిమాలోని ‘బేషరమ్ రంగ్’ సాంగ్లో కాషాయ రంగుని అవమానించారని సాధువు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ సినిమాను బాయ్కాట్ చేయాలని ఆయన అందరికీ పిలుపునిచ్చారు. ‘పఠాన్’ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తే వాటిని తగులబెడతానని ఆచార్య హెచ్చరించారు. ఈ సాధువుతో పాటుగా ఇది వరకూ హనుమాన్ గర్హి పూజారి మహంత్ రాజు దాస్ కూడా సినిమాపై నిరసన వ్యక్తం చేయడంతో పలువురు వారికి అనుకూలంగా కామెంట్స్ చేస్తున్నారు.