KBC Season-14: అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో తెలియదు. కటిక బీదరికం లో ఉన్నవారు క్షణాల్లో కోటీశ్వరులు కావచ్చు.. ధనవంతులు అనుకోకుండా ఉన్న డబ్బులు ఖాళీ అయిపోతాయి. తాజాగా జరిగిన ఘటనలో సాధారణ మహిళ ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా రూ. కోటి గెలుచుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న ‘కౌన్బనేగా కరోడ్పతి-14’లో పాల్గొన్న ఓ సాధారణ గృహిణి ఈ సంచలనాన్ని సృష్టించింది. ఈ సీజన్లో రూ. కోటి గెలుచుకున్న తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. అయితే ఈ షోలో రూ. కోటి గెలవాలంటే ఉన్నత చదువులు, ప్రతిభావంతులైన వారే గెలుస్తారని అంటుంటారు.కానీ.. ఈ మహిళ మాత్రం చదివింది కేవలం 12వ తరగతి కావడం అందరినీ ఆలోచింప చేస్తుంది.
మహారాష్ట్రలోని కొల్హాపూర్కు చెందిన కవితా చావ్లా ఈ సీజన్లో పాల్గొని చివరి ప్రశ్న వరకు చేరుకుని రూ. కోటి సాధించింది. విజయం అనంతరం ఆమె ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడించింది. ఈ షోలో పాల్గొనేందుకు తాను ప్రత్యేకంగా ఓ పుస్తకం కానీ, టీవీ చానళ్లు కానీ చూడలేదన్నారు. తన కుమారుడికి తాను ఏది బోధించిన ఆ పుస్తకాలనే తాను కూడా చదువుకునే వాడినన్నారు. ముఖ్యమైన విషయాలను అండర్లైన్ చేసుకునే వాటిని గుర్తు చేసుకున్నానన్నారు.
కేబీసీ షో లో గెలుచుకున్న సొమ్ముతో ఏం చేస్తారని ప్రశ్నించగా.. ఆ డబ్బును తన కుమారుడి చదువు కోసం ఉపయోగిస్తానని, దానికే తన తొలి ప్రాధాన్యమని అన్నారు. పైచదువుల కోసం అతడిని విదేశాలకు పంపుతానన్నారు. విదేశాల్లో చదువుకుని దేశానికి గర్వకారణంగా నిలవాలన్నది అతడి కల అని తెలిపారు. నిజానికి తాను డబ్బులు గెలుచుకోవాలన్న ఉద్దేశంతో ఈ షోలో పాల్గొనలేదని అంటారు కవితా చావ్లా. ఆత్మగౌరవం కోసమే తానీ షోలో పాల్గొన్నట్టు చెప్పారు.ఆమె వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెపై ప్రశంస జల్లులు కురిపిస్తున్నారు. మనపై మనకు నమ్మకం, పట్టుదల, సమయస్ఫూర్తి ఉండే దేనైనా సాధించవచ్చుని పలువురు కామెంట్లు చేస్తున్నారు.