ఏపీలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు జగన్కు ఎన్నికల వ్యూహాలు అందించిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్, పార్టీ మార్చేశారు. జగన్ని పీకేసిన పీకే.. టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం కావడం సంచలనం సృష్టించింది. ప్రశాంత్ కిశోర్ గెలిచే పార్టీకే వ్యూహాలు అందిస్తారనే టాక్ ఉంది. జగన్ ఓటమి పక్కా అని తేలడంతోనే పీకే, బాబుతో భేటీ అయ్యారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏపీలో తెలుగుదేశం విజయం అనేక సర్వేలు స్పష్టం చేశాయి. పీకే ఆధ్వర్యంలోని ఐప్యాక్ సర్వేలోనూ ఇదే ఫలితం వచ్చిందని తాజా పరిణామాలతో తేలిపోయింది.
చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ మీటింగ్ వెనుక జాతీయ స్థాయిలో కీలకమైన ఇద్దరు వ్యక్తులు ఉన్నారని తెలుస్తోంది. గతంలో ప్రశాంత్ కిశోర్ వ్యూహాలతో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన నితీశ్కుమార్, బెంగాల్లో హ్యాట్రిక్ కొట్టిన మమతా బెనర్జీ ఏపీలో పొలిటికల్ ట్విస్ట్ వెనుక ప్రధాన సూత్రధారులుగా వ్యవహరించారట. జగన్ ప్రభుత్వం బాబును అరెస్టు చేసినప్పుడు ఆయనకు మద్దతుగా నిలిచారు నితీశ్ కుమార్, మమతా బెనర్జీ. టీడీపీని ఇండియా కూటమిలో చేర్చుకోవడానికి తెరవెనుక ప్రయత్నాలు జరిగాయి. అయితే తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎన్నికలకు ముందు జాతీయ స్థాయిలో ఏ కూటమిలోనూ చేరడానికి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో మోదీ సర్కారును గద్దె దించడానికి బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. హిందీ రాష్ట్రాల్లో కమలనాథులను కట్టడి చేయడంతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో బీజేపీ అనుకూల పార్టీలను ఓడించడానికి ప్లాన్ చేస్తున్నాయి విపక్షాలు. ఈ వ్యూహంలో భాగంగానే పార్లమెంటులో బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, ఏపీలో కట్టడి చేసే ప్రయత్నాల్లో ఉంది కాంగ్రెస్ కూటమి. ప్రశాంత్ కిశోర్తో, చంద్రబాబు సమావేశం ఇందులో భాగమని అంటున్నారు విశ్లేషకులు.
ఇప్పటికిప్పుడు టీడీపీ, ఇండియా కూటమిలో చేరే సూచనలైతే లేవు. ఎన్నికల తర్వాత బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ రాకపోతే.. ఇండియా కూటమికి ప్రతి సీటూ ముఖ్యమే. అందుకే నితీశ్కుమార్, మమతా బెనర్జీ వంటి నాయకులు, చంద్రాబాబుతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఏ కూటమికీ పూర్తి స్థాయి ఆధిక్యం రాకపోతే, టీడీపీ మద్దతు కీలకం అవుతుంది. అదే జరిగితే జాతీయ స్థాయిలో చంద్రబాబు మరోసారి చక్రం తిప్పే అవకాశం ఉంటుంది.