Ys Bharathi Reddy: ఎన్నికల సమయంలో రాజకీయ నేతల ప్రచారం జోరుగా సాగుతోంది. సమయం దగ్గర పడటంతో వారికి మద్దతుగా వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రచారాన్ని ప్రారంభించారు. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ఆయన అన్న నాగబాబు,అన్న కొడుకు వరుణ్ తేజ్ ర్యాలీ నిర్వహించారు. ఇప్పుడు తాజాగా జగన్ భార్య భారతీదేవి భర్తకి సపోర్టుగా ప్రచారం చేస్తుంది. పులివెందుల నియోజకవర్గంలో భారతి పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు వేంపల్లిలో ఊహించని సంఘటన ఒకటి ఎదురయింది.
ఊహించని పరిణామానికి ఎలా రియాక్ట్ కావాలో తెలియని భారతి మౌనంగా ఉండిపోయారు. ఇంతకీ ఏం జరిగిందంటే ప్రచారంలో భాగంగా భారతి పులివెందుల నియోజకవర్గం పరిధిలోని వేంపల్లి లో పర్యటించారు. ప్రచారంలో భాగంగా గొర్లమందల కాలనీలో మాజీ సర్పంచ్ ఇంటి వద్దకు వెళ్లి వైసీపీకి ఓటు వేయాలని ఆమె కోరారు. అందరూ ఆమెకి సానుకూలంగానే మాట్లాడుతూ ఉండటంతో వాళ్ల నుంచి కూడా ఆమె సానుకూల స్పందన ఆశించింది.
అయితే అనూహ్యంగా కుమ్మరాంపల్లె మాజీ సర్పంచ్ భర్త, వైసీపీ నేత అయిన భాస్కర రెడ్డి ఒక్కసారిగా మా తాతల కాలం నుంచి వారసత్వంగా వస్తున్న భూముల పట్టా పాస్ పుస్తకాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు అంటూ సూటిగా ప్రశ్నించారు. రైతుల పాసు పుస్తకాలపై రైతులు ఫోటోలు ఉండాలి కానీ ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు అని నిలదీశారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్ ప్రతి సమావేశంలోనూ నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటున్నారు తప్పించి ఒకసారి కూడా నా రైతన్న అని పలకటం లేదు అన్నారు.
అలాగే రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తంలో సగం కేంద్రానిదే అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు అన్నారు, మరి ఆ మొత్తాన్ని పెంచి రైతులకు మేలు జరిగేలా చూడవచ్చు కదా అని కోరారు. భాస్కర్ రెడ్డి నుంచి ఎదురైన ఈ ప్రశ్న తో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ప్రశ్న అడిగిన పెద్దమనిషి పార్టీకి చెందిన నాయకుడు కావడంతో ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాని భారతి మౌనంగా అక్కడ నుంచి నిష్క్రమించారు.