Tuni Assembly Constituency: తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో కూటమిలో కాస్త ఆ నియోజకవర్గం సీటు ఎవరిదనే విషయంపై కాస్త గందరగోళం ఉండేది. అయితే పంపకాలలో తుని నియోజకవర్గం తెదేపాకి దక్కింది. ఈ నియోజకవర్గ నుంచి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య కూటమి తరపున బరిలో దిగుతున్నారు. ఆమెకు ప్రత్యర్థిగా వైసీపీ నుంచి మంత్రి దాడిశెట్టి రాజా దిగుతున్నారు. గెలుపు తనదే అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు రాజా.
అందుకు కారణం లేకపోలేదు, తుని నియోజకవర్గంలో యనమల రామకృష్ణుడి మీద పెద్దగా వ్యతిరేకత లేకపోయినా ఆయన సోదరుడు కృష్ణుడి మీద తీవ్రమైన వ్యతిరేకత ఆ నియోజకవర్గంలో కనిపిస్తుంది. అదే సమయంలో యనమల కృష్ణుడు తెదేపాని వదిలి వైసీపీలో చేరడంతో తుని లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. గతంలో ఈ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన కృష్ణుడు ఈ ఎన్నికలలో కూడా టికెట్ ని ఆశించారు.
అయితే అధిష్టానం మాత్రం టికెట్ ని యనమల రామకృష్ణుడి కుమార్తె దివ్యకు ఇవ్వటంతో అసంతృప్తితో ఉన్న కృష్ణుడు వైసీపీలో చేరిపోయారు. 2014లో దాడిశెట్టి రాజా వైఎస్ఆర్ సీపీకి ప్రాతినిధ్యం వహించగా తెలుగుదేశం తరపున యనమల రామకృష్ణుడు నిలబడ్డారు. 2019లో కూడా మళ్లీ వాళ్ళిద్దరే పోటీపడ్డారు, రెండుసార్లు దాడిశెట్టి రాజాయే విజయం సాధించారు. ఈసారి కూడా హ్యాట్రిక్ సాధించాలనే కసితో ఉన్నారు రాజా. అయితే ఈసారి రాజా విజయం కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కృష్ణుడిని తమ పార్టీలోకి తెచ్చుకుంటే కూటమికి నష్టమని భావించిన వైసీపీ ఇప్పుడు ఆ నిర్ణయం వైసీపీ నే ముంచేలా ఉంది. ఎందుకంటే తునిలో కూటమికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. తొండంగి మండలానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్లు అందరూ ఒకే మాట మీద ఉండి దివ్యకి సపోర్టు చేసి ఆమెని అఖండ విజయంతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కృష్ణుడి మీద ఏమాత్రం వ్యతిరేకత ఉన్నప్పటికీ అది దివ్య గెలుపుకి ఏమాత్రం అడ్డంకి కాదని విజయం తమదే అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.