Talasani Srinivas Yadav: తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ సర్కార్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా హైదరాబాదులో ఏకంగా లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి పేదలకు ఉచితంగా ఇవ్వనుంది. దీనిలో భాగంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావడంతో ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేసి అర్హులైన వారికి ఆ ఇళ్లను అందచేస్తోంది. ఈ క్రమంలో ఆబిడ్స్లోని మురళీ ధర్బాగ్లో నిర్మించిన 120 రెండు పడక గదుల ఇళ్ల సముదాయాన్ని లబ్ధిదారులకు అందజేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
బీఆర్ఎస్ ప్రభుత్వం నగరంలో లక్ష రెండు పడక గదుల ఇళ్లను పేదలకు ఉచితంగా నిర్మించి ఇస్తోందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ప్రస్తుతం లబ్ధిదారులకు అందజేసిన మురళీధర్ బాగ్లో నిర్మించిన ఒక్కో ఇంటికి బహిరంగ మార్కెట్లో రూ.కోటి ధర పలుకుతోందని, ఈ లెక్కన పేద కుటుంబాలు కోటీశ్వరులేనని తెలిపారు. హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే రాజాసింగ్తో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం తలసాని మాట్లాడుతూ..
ప్రభుత్వం అందజేస్తోన్న ఈ ఇళ్లను అమ్మితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. వీటిని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా డిజైన్ చేసి రాష్ట్రవ్యాప్తంగా నిర్మించి ఇస్తున్నారని, ఇది రాజాసింగ్ చెప్పినట్లు ప్రధాని ఆవాస్ యోజన కింద వచ్చినవి కావని ఈ సందర్భంగా మంత్రి తలసాని స్పష్టం చేశారు.