T20 2024: ఇటీవల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది. మూడు రౌండ్లలో ఈ ప్రపంచకప్ను ఐసీసీ నిర్వహించింది. తొలుత 16 జట్లతో క్వాలిఫైయింగ్ రౌండ్, ఆ తర్వాత సూపర్ 12 దశను నిర్వహించింది. అనంతరం సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ జరిగాయి. అయితే 2024 ప్రపంచకప్లో భారీ మార్పులు చేయాలని ఐసీసీ నిర్ణయించింది. 2021, 2022లో జరిగిన టీ20 ప్రపంచకప్ ఎడిషన్లలో క్వాలిఫయింగ్ దశలున్నాయి. కానీ టీ20 ప్రపంచకప్ 2024లో మాత్రం క్వాలిఫయింగ్ రౌండ్ ఉండదు. అదే సమయంలో సూపర్ 12 కూడా ఉండదు.
2024లో టీ20 ప్రపంచకప్ను కొత్త ఫార్మాట్లో ఐసీసీ నిర్వహించనుంది. మెగా టోర్నీ మరింత రసవత్తరంగా ఉండేందుకు పలు మార్పులు చేయాలని ఐసీసీ నిరణయించింది. దీంతో టైటిల్ కోసం ఏకంగా 20 జట్లు పోటీ పడనున్నాయి. వచ్చే సీజన్లో క్వాలిఫైయింగ్ మ్యాచ్లు ఉండవు. 20 జట్లు నాలుగు గ్రూపులుగా తలపడతాయి. ఒక్కో గ్రూపులో ఐదు జట్లు ఆడతాయి. ఒక్కో గ్రూప్ నుంచి రెండేసి జట్లు సూపర్-8లోకి అడుగుపెడతాయి. సూపర్-8లో మళ్లీ 8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోతాయి. ఒక్కో గ్రూప్ నుంచి టాప్-2 జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి.
2024లో జరిగే ప్రపంచకప్ కోసం ఇప్పటికే 12 జట్లు నేరుగా అర్హత సాధించాయి. మిగతా 8 జట్లు ఇతర రౌండ్ల ద్వారా మెగా టోర్నీలోకి ప్రవేశిస్తాయి. ఈ టోర్నీలో ఆతిథ్య జట్లుగా అమెరికా, వెస్టిండీస్ అర్హత సాధించాయి. ఇంగ్లండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇండియా, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ వంటి జట్లు నేరుగా ఆడనున్నాయి. వీటితో పాటు ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ జట్లు అర్హత పొందాయి.
మిగతా 8 జట్లు ఎలా క్వాలిఫై అవుతాయి?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే మిగతా 8 జట్లను ప్రాంతీయ అర్హత ఆధారంగా ఐసీసీ నిర్ణయించనుంది. ఆఫ్రికా, ఆసియా, యూరప్ ఖండాలు రెండు క్వాలిఫికేషన్ స్పాట్లను కలిగి ఉండగా.. అమెరికా, తూర్పు ఆసియా పసిఫిక్ ఒక్కో స్థానాన్ని కలిగి ఉన్నాయి. ప్రాంతీయ అర్హత ఆధారంగా ఎన్నికైన 8 జట్లు నాలుగు గ్రూపులలో రెండేసి చొప్పున ఆడనున్నాయి.