Rohit Sharma: టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా మూడు టీ20 సిరీస్లను ఆడింది. వీటిలో రెండు సిరీస్లలో కెప్టెన్ రోహిత్ ఆడలేదు. న్యూజిలాండ్, శ్రీలంకలతో జరిగిన టీ20 సిరీస్లకు రోహిత్ అందుబాటులో లేడు. దీంతో 2024 టీ20 ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్ లేడని.. అందుకే అతడిని సెలక్టర్లు టీ20లకు పరిగణనలోకి తీసుకోవడం లేదని ప్రచారం జరిగింది. కట్ చేస్తే.. టీ20 ఫార్మాట్ను వదిలే ప్రసక్తే లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంటున్నాడు. దీంతో ఇప్పుడు అతడి వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి.
ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లను టీ20లకు దూరంగా ఉంచాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వర్క్ లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా శ్రీలంకతో టీ20 సిరీస్కు దూరంగా ఉన్నానని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. మూడు ఫార్మాట్లు ఆడుతున్న ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి అవసరమని.. అందుకే తాను ఇటీవల టీ20లకు దూరంగా ఉన్నట్లు వివరించాడు.
టీ20 ఫార్మాట్ను వదిలేయాలని నిర్ణయించుకోలేదని రోహిత్ అన్నాడు. ముందుగా బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్లు ఆడటం సాధ్యం కాదని.. మూడు ఫార్మాట్ల ప్లేయర్కు కావాల్సినంత విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఉందన్నాడు. తాను కూడా అలాగే రెస్ట్ తీసుకున్నానని తెలిపాడు. త్వరలో న్యూజిలాండ్తో మూడు టీ20ల సిరీస్లో పాల్గొంటానని సమాధానం ఇచ్చాడు. ఐపీఎల్ తర్వాత ఏం జరుగుతుందో చూడాలని.. ఇప్పటికైతే టీ20 ఫార్మాట్ను వదులుకోవాలని నిర్ణయించుకోలేదని చెప్పుకొచ్చాడు.
వన్డే ఫార్మాట్లో వాళ్లకు చోటు కష్టమే
టీ20లలో అద్భుతంగా రాణిస్తున్న ఇషాన్ కిషన్, సూర్యకుమార్లకు వన్డేలలో చోటు దక్కడం కష్టమేనని రోహిత్ అన్నాడు. వన్డేల్లో గిల్, శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా ఆడుతున్నారని.. వాళ్ల రికార్డులు కూడా బాగున్నాయని రోహిత్ చెప్పాడు. అటు నెట్స్లో బౌలింగ్ చేస్తున్నప్పుడు బుమ్రా వెన్నులో పట్టేసిందని, దాంతోనే వన్డే సిరీస్ నుంచి అతన్ని తప్పించాల్సి వచ్చిందని రోహిత్ శర్మ తెలిపాడు.