Animals Aadhar Card: ఆధార్ అనేది 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య. దీనిని భారతదేశంలో నివసించే వ్యక్తుల వారి వేలి ముద్రలు, కొద్దిపాటి వ్యక్తిగత వివరాల ఆధారంగా పొందవచ్చు. ప్రస్తుతం ఆధార్కార్డు ప్రతి ఒక్కరికి అవసరమే. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాల దరఖాస్తులకు ఆధార్ కచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఈ ఆధార్ మనుషులకే కాదు.. పశువులకు కూడా మంజూరు చేయనున్నారు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ పాడి పరిశ్రమ సదస్సులో ప్రధాని మోదీ ఓ కీలక ప్రకటన చేశారు. కిసాన్ యోజన లేదా మరేదైనా ప్రభుత్వ సహాయం నేరుగా రైతు, పౌరుల ఖాతాకు వచ్చేందుకు ఆధార్ సహకరిస్తోంది. ఇప్పుడు మోదీ ఆధార్ కార్డును గేదెలకు సైతం అందించాలని భావిస్తున్నట్లు తెలిపారు. వి నడానికి ఇది కాస్త వింతగా ఉన్నా దీనివల్ల రైతులకు ఉపయోగం ఉంటుందని తెలుస్తోంది.
అంతర్జాతీయ డెయిరీ సదస్సును మోదీ ప్రారంభించిన అనంతరం ఈ విషయాన్ని ప్రకటించారు. పాడి పశువులన్నింటికీ ఆధార్ కార్డు తయారు చేస్తామని తెలిపారు. దేశంలో డెయిరీ రంగాన్ని సైన్స్ తో ముడిపెట్టి విస్తరిస్తున్నట్లు వెల్లడించారు. పాడి జంతువులకు సంబందించిన అతిపెద్ద డేటాబేస్ను భారత్ రూపొందిస్తోందని ఆయన వెల్లడించారు. డెయిరీ రంగానికి సంబంధించిన ప్రతి జంతువును ట్యాగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆధార్ కార్డును రూపొందించడానికి బయోమెట్రిక్ సమాచారం అవసరం. అంటే వేలిముద్రలు, కళ్లు తదితర సమాచారం తీసుకుంటారు. ఈ విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జంతువుల బయోమెట్రిక్ సమాచారాన్ని తీసుకుంటారు. ఈ ప్రచారానికి ‘పశు ఆధార్ అని పేరు పెట్టారు. జంతువుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవడంతో పాటు, పాల ఉత్పత్తులకు సంబంధించిన మార్కెట్ను విస్తరించేందుకు ఇది దోహదపడుతుందని మోదీ చెబుతున్నారు.