YS Jagan: ఏపీలో జరిగిన పట్టభద్రుల ఎన్నికలు రాష్ట్రంలో వైసీపీ పాలనపై క్లియర్ కట్ తీర్పుని ఇచ్చాయి. నాలుగేళ్ల పాలన ఏ విధంగా సాగించారనే దానిపై చదువుకున్న వారంతా ఓటు రూపంలో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక కేవలం సంక్షేమం మాత్రమే రాష్ట్ర ప్రజలకు, నిరుద్యోగ, ఉద్యోగులకు అవసరం లేదని చెప్పకనే చెప్పారు. జగన్ పాలనలో జరుగుతున్న వైఫల్యాలపైనా తీవ్రంగా స్పందించారు.
వైసీపీని అధికారంలోకి తీసుకురావడంలో అన్ని వర్గాలు, కులాలు, నిరక్షరాస్యులు, అక్షరాస్యులు, మేధావులు, బుద్ధిజీవులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు ఇలా అన్ని రకాల వ్యక్తులు కీలక పాత్ర పోషించారు. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ తమ గుర్తింపును, గౌరవాన్ని కోరుకుంటారు. విస్మరణను తట్టుకోలేరు. తమను నిర్లక్ష్యం చేస్తున్న పాలకులపై అసంతృప్తితో అదును చూసుకుని దెబ్బకొడ్తారు. ఓటమి నుంచి ఎన్ని గుణపాఠాలైనా నేర్చుకోవచ్చు.
అసలు రాజశేఖరరెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మధ్యన ఉన్న ఒక ముఖ్యమైన తేడాకి సంబంధించిన చర్చకు తెరలేచింది. పూర్తిగా తన తండ్రిని ఆదర్శంగా తీసుకుని పాలన సాగించినట్టైతే, ఇవాళ జగన్ ఇంత మందిని శత్రువులుగా చేసుకునేవారు కాదేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఫలితాలు, ఓటింగ్ సరళిని గమనిస్తే జగన్పై వ్యతిరేకత ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
ఈ ఫలితాలను దృష్టిలో పెట్టుకుని క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదో, ప్రభుత్వంపై వ్యతిరేకత ఎందుకో తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. వైసీపీ మొట్టమొదట చేయాల్సిన పని ఆత్మపరిశీలన. వైసీపీ అధినేతగా, అలాగే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పనితీరు ప్రజలకు ఒక నిశ్చాతాభిప్రాయాన్ని ఏర్పరిచింది.