Biryani: కరోనా మహమ్మారి సమయంలో మూతపడిన నాన్ వెజ్ వ్యాపారాలు మళ్లీ ఊపందుకున్నాయి. విజయవాడ పున్నమి ఘాట్ నుంచి ఆటోనగర్ బస్స్టాండ్ వరకు, పాత కంట్రోల్ రూం సెంటర్ నుంచి రామవరప్పాడురింగ్ వరకు, ఏలూరు లాకుల నుంచి పడవలరేవు సెంటర్ వరకు, రైల్వే స్టేషన్ నుంచి పైపుల రోడ్డు వరకు, వన్టౌన్ నుంచి కొత్తపేట వరకు మాంసాహార వ్యాపారాలు కిటకిటలాడుతున్నాయి. రోజు ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు ఘుమఘుమలతో మాంసాహార ప్రియులను వ్యాపారులు ఆకర్షిస్తున్నారు. చికెన్ పకోడి నుంచి చైనీస్ వంటకాల వరకు, మోమోస్ నుంచి షవర్మ వరకు, రోటీ పాయ నుంచి తందూరి వరకు సందు సందుల్లో వెలిసిన తోపుడు బళ్లతో పాటు ప్రధాన రహదారుల్లోని హోటళ్లు, స్టార్ హోటళ్లలో రకరకాల రుచులతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.
రాత్రి సమయాల్లో మాత్రమే అందుబాటులో ఉండే ఫుడ్ కోర్టులతోపాటు స్టార్ హోటళ్లు నిర్వహించే ఫుడ్ ఫెస్టివల్స్ పసందైన రుచులతో రమ్మంటూ ఆహ్వానిస్తున్నాయి. అలా అని మాంసాహారం అతిగా తినడం అసలు మంచిది కాదు. వారంలో ఒకరోజు తింటే ఫర్వాలేదని, మూడు, నాలుగు రోజులు తీసుకుంటే ఒబెసిటీతో పాటు, ఫ్యాటీ లివర్, మధుమేహం, రక్తపోటు, వత్తిడి వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందంటు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నతనంలో ఊబకాయులుగా మారితే పెనుప్రమాదమని హెచ్చరిస్తున్నారు. సంప్రదాయ, ఆర్గానిక్ ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. మాంసాహారం ఎక్కువగా తినడం వల్ల అనారోగ్యం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
నాన్వెజ్ వంటకాల్లో ఎక్కువ మంది ఇష్టపడుతు న్నది బిర్యానీ. దశాబ్దం క్రితం చికెన్, మటన్ బిర్యానీ అందుబాటులో ఉండేవి. ఇప్పుడు రొయ్యలు, చేపలు, పీతల బిర్యానీలు సరికొత్త రుచులను అందిస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు వ్యాపారులు రకరకాల పేర్లతో బిర్యానీలు వడ్డిస్తున్నారు. కుండ బిర్యాని, బుట్ట బిర్యాని, కోనసీమ బిర్యానీ, రాయలసీమ బిర్యానీ, కాకినాడ బిర్యానీ, అరేబియన్ మండీ బిర్యానీ అంటూ వ్యాపారులు ఆకట్టుకుంటున్నారు. ఫుడ్కోర్టుల నుంచి స్టార్ హోటళ్ల వరకూ బిర్యానీలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ప్రత్యేకంగా బిర్యానీలు మాత్రమే విక్రయించే బిర్యానీ పాయింట్లు వీధివీధినా కొలువుతీరాయి. బిర్యానీ, నాన్వెజ్ వంటకాలు ఎక్కువ తినడం మంచిది కాదు. వాటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం వలన ఫ్యాటీ లివర్, జీర్ణకోశ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. చిరుధాన్యాల్లోనూ పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. వాటినీ పరిమితంగానే తీసుకోవాలి. ఆహార నియమాలు పాటించాలి.