Mega-Nandamuri: టాలీవుడ్లో మెగా, నందమూరి హీరోలకు ఊహించని స్థాయిలో అభిమానులు ఉన్నారు. మెగా హీరోలు, నందమూరి హీరోల సినిమాలు విడుదలైతే థియేటర్ల వద్ద ఎలాంటి హడావిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ నటించిన సినిమాలు ఒకేసారి విడుదల అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు ఒక్కరోజు తేడాలో రిలీజ్ అవుతుండటంతో ఏ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు ఎక్కువ రాబడుతుందో అని ఇరు వర్గాల అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ మూవీ అఖండ రికార్డులను అధిగమించాలని మెగా అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
టాలీవుడ్లో హిట్ అయిన కాంబినేషన్లను రిపీట్ చేయడం కొత్తేమీ కాదు. అయితే మెగా హీరోల పక్కన నటించిన హీరోయిన్లను నందమూరి హీరోలు రిపీట్ చేస్తే చేదు ఫలితాలు వచ్చాయి. ఈ విషయంలో సెంటిమెంట్ వర్కవుట్ కాలేదని నందమూరి హీరోలు సైతం అంగీకరించాల్సిన పరిస్థితి నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ఇంద్ర సినిమాకు బి.గోపాల్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించారు.
అయితే నందమూరి బాలకృష్ణ నటించిన పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాకు కూడా బి.గోపాల్ దర్శకుడిగా వ్యవహరించారు. అయితే ఈ సినిమాకు ఇంద్ర మూవీలోని హీరోయిన్లను రిపీట్ చేశారు. దీంతో మెగాస్టార్ పక్కన నటించిన ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రేలను బాలయ్య సరసన నటింపచేశారు. అయితే పల్నాటి బ్రహ్మనాయుడు డిజాస్టర్ ఫలితాన్ని చవిచూసింది. మెగా హీరోయిన్లను నమ్మి నందమూరి బాలయ్య బోల్తా కొట్టారని అప్పట్లో కామెంట్లు వినిపించాయి.
పవన్ బాటలో ఎన్టీఆర్.. మళ్లీ చేదు ఫలితం
మెగా హీరోయిన్లను నందమూరి హీరోలు మరోసారి కూడా రిపీట్ చేశారు. పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అత్తారింటికి దారేది సినిమాలో సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా పవన్ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అయితే సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన రభస సినిమాలో మెగా హీరోయిన్లను రిపీట్ చేశారు. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన సమంత, ప్రణీతలను హీరోయిన్లుగా తీసుకున్నారు. కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్గా నిలిచింది. దీంతో మెగా హీరోయిన్లు నందమూరి హీరోలకు కలిసి రారనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో నాటుకుపోయింది.