Ravi Babu: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడు అయిన చలపతిరావు మరణించడంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. చలపతి రావు మరణించిన సమయం గురించి పలువురు రకరకాలుగా చెబుతుండగా వాటిపై ఆయన కుమారుడు రవిబాబు క్లారిటీ ఇచ్చారు. దర్శక నిర్మాత, నటుడు అయిన రవిబాబు తన తండ్రి మరణం గురించి ప్రకటన చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు చలపతి రావు ఎలా చనిపోయారు అనే విషయాన్ని రవిబాబు మీడియాకు వివరించారు.
తన తండ్రి చలపతిరావు మరణం చాలా ప్రశాంతంగా జరిగిందని రవిబాబు చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ నాన్నను బాబాయిని ముద్దుగా పిలుస్తూ ఉంటారని అలాంటి ఆయన అందరితో ఎంతో సరదాగా ఉంటారని అన్నారు. జోక్సు వేసుకుంటూ కామెడీలు చేస్తూ సందడిగా కనిపిస్తారని తెలిపారు. అలా ఆయన ఉన్నారు కాబట్టే సరదాగా ఎలాంటి నొప్పి లేకుండా ప్రశాంతంగా చనిపోయినట్లు రవిబాబు మీడియాకు వెల్లడించారు. చలపతిరావు రాత్రి భోజనం చేసే వరకు బాగానే ఉన్నారని, చికెన్ బిర్యాని, చికెన్ కూర తిని ఆ ప్లేట్ ఇలా ఇచ్చి వెనక్కి వాలిపోయారని రవిబాబు తెలిపారు.
చికెన్ బిర్యానీ తిని ప్రశాంతంగా ఆయన చనిపోయారని రవిబాబు వెల్లడించారు. చలపతిరావు సినీ పరిశ్రమలో ఎంతో మందికి మంచి చేశారని, అది చాలా మందికి తెలుసని అన్నారు. ఎంతో మందికి మంచి చేయడం వల్లే ఆయన ప్రశాంతంగా చనిపోయినట్లు తెలిపారు. తమ చెల్లెళ్లు ఇద్దరూ అమెరికాలో ఉండటం వల్ల వారికి టికెట్లు దొరకకపోవడం వల్ల అంత్యక్రియలు ఆలస్యం అవుతున్నాయని, మంగళవారం రాత్రి వారు ఇంటికి చేరుకుంటారని, ఆ తర్వాత అంత్యక్రియలు చేస్తామని తెలిపారు.
మంగళవారం వరకు మహాప్రస్థానంలో ఫ్రీజర్ లో చలపతి రావు పార్థివదేహాన్ని ఉంచుతున్నట్లు రవిబాబు తెలిపారు. బుధవారం అంత్యక్రియలు చేయనున్నట్లు వెల్లడించారు. తాను తీస్తున్న సినిమాలో ఆయన చివరిసారి నటించినట్లు తెలిపారు. ఐదురోజుల క్రితమే చలపతిరావు షూటింగ్ లో పాల్గొన్నట్లు వివరించారు.