Pitapuram Politics: జనసేన అధినేత వారాహి యాత్రను మొదలు పెట్టారు. ఆయన చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పిఠాపురం నుంచి యాత్రను ప్రారంభించారు. యాత్ర మొదలు పెట్టడానికి ముందు ఆయన టీడీపీ నేత వర్మ ఇంటికి వెళ్లారు. ఆయనతో మాట్లాడారు. ఆయనతో భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. వర్మ తనకు మద్దతు పలుకుతున్నారని చెప్పారు. వర్మ మద్దతను తనకు లభించడం సంతోషంగా ఉందని చెప్పారు. కూటమి నేతలంతా కలిసి తనను గెలిపించాలని కోరారు. ఏపీలో కొనసాగుతున్న అరాచక పాలనను అంతమొందిచాలని పిలుపు నిచ్చారు.
యాత్రను ప్రారంభించడానికి ముందు ఆయన వర్మను కలవడం చాలా మంచి నిర్ణయమని చెప్పాలి. ఎందుకంటే.. వర్మ పిఠాపురం టీడీపీ టికెట్ ఆశించారు. టికెట్ జనసేనకు ప్రకటించిన తర్వాత ఆయన మద్దతు దారులు ఆందోళన చేశారు. ఆయనకూడా తన దారి తాను చూసుకుంటానని అన్నారు. అయితే, చంద్రబాబు ఆయన్ని పిలిచి మాట్లాడారు. ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో వర్మ దిగి వచ్చారు. పవన్ కు అన్ని విధాల సహకరిస్తానని చెప్పారు. పైగా 2014లో ఆయన ఇండిపెండెట్ గా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత వర్మ టీడీపీలో చేరారు. అలాంటి వ్యక్తి పవన్ కు సపోర్టు చేయకపోతే ఇబ్బంది తప్పదు. అందుకే చంద్రబాబు ఆయన్ని ఒప్పించారు. కూటమిలో భాగంగా వర్మను ఒప్పించాల్సిన బాధ్యత చంద్రబాబుదే అని పవన్ వదిలేయ లేదు. వారాహి యాత్రకు ముందు వర్మ దగ్గరకు వెళ్లి.. పవన్ తనకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో చెప్పకనే చెప్పారు. దీంతో.. వర్మ వర్గీయులు అంతా ఇప్పుడు పవన్ గెలుపు కోసం పని చేసే అవకాశం మెండుగా ఉంది. పైగా పవన్ యాత్ర కేవలం పిఠాపురం కోసం మాత్రమే కాదు.. తొలి విడతలో ఏకంగా 10 నియోజవర్గాలను కవర్ చేసేలా ప్లాన్ చేశారు. అంటే.. రాష్ట్రవ్యాప్త పర్యటనకు ముందు పవన్ వర్మను కలిశారంటే ఆయనకు ప్రత్యేకంగా ఓ గుర్తింపు ఇచ్చారు.. ఇలా స్థానిక టీడీపీ నేతలను తన వైపు తిప్పుకున్నారు.
వర్మతో కలిసిన తర్వాత ఆయన తన యాత్రను మొదలు పెట్టారు. యాత్రకంటే ముందు పోలీసులు పవన్ ను ఇబ్బంది పెట్టారు. వారాహి యాత్ర వాహనానికి పూజలు చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో పూజలు లేకుండానే ఆయన తన యాత్రను మొదలు పెట్టారు. యాత్రలో భాగంగా ఆయన ప్రసంగంలో వైసీపీపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. వైసీపీ అరాచక పాలనను అంతం చేయడం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టాయని చెప్పారు. మూడు పార్టీ నేతలు కూడా దానికి అనుగుణంగా పని చేయాలని పిలుపునిచ్చారు. పిఠాపురాన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని చెప్పారు. అధికారంలోకి రాగానే స్థానికంగా ఉన్న ఆస్పత్రులను బాగు చేస్తానని హామీ ఇచ్చారు. నైపుణ్యాభివృద్ది కేంద్రాలను ఏర్పాటు చేస్తానని చెప్పారు. పిఠాపురాన్ని మోడల్ నియోజవర్గంగా మార్చుతానని ప్రజలకు హామీ ఇచ్చారు.