Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తాజాగా యూపీఐ సేవలను ప్రారంభించింది. ఐసీఐసీఐ బ్యాంక్తో కలిసి ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్లు గూగుల్ పే, ఫోన్ పే తరహా థర్డ్ పార్టీ యాప్స్తో పనిలేకుండా నేరుగా జొమాటో నుంచే పేమెంట్స్ చేయవచ్చు. ఇందుకోసం యూపీఐ ఐడీ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్లు చాలా మంది యూపీఐ సేవలను వాడుతున్నారని, అందుకే ఐసీఐసీఐ సహకారంతో యూపీఐ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు జొమాటో అధికార ప్రతినిధి తాజాగా అధికారికంగా వెల్లడించారు.
అదే సమయంలో క్యాష్ ఆన్ డెలివరీ సేవలను ఎత్తివేయాలన్న ఆలోచనలోనూ జొమాటో ఉన్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకున్న సందర్భాల్లో కస్టమర్ ఆహారాన్ని తిరస్కరించే అవకాశం ఉన్నందున సీఓడీ విధానానికి స్వస్తి పలకాలని జొమాటో సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు యూపీఐ మార్కెట్లో ఫోన్పే, గూగుల్పే, పేటీఎందే మెజారిటీ వాటా. దీంతో ఆయా యాప్స్పై అతిగా ఆధారపడడాన్ని తగ్గించాలని ఎన్సీపీఐ భావిస్తోంది. అందుకే ఒక్క కంపెనీ కూడా 30 శాతానికి మించి మార్కెట్ వాటా కలిగి ఉండకూడదని నిర్ణయించింది. ఇందుకోసం 2024 డిసెంబర్ 31 డెడ్లైన్గా నిర్దేశించింది.
ఈ క్రమంలోనే గూగుల్, ఫోన్పే వంటి యాప్స్పై ఆధారపడడం తగ్గించేందుకు వేర్వేరు సంస్థలకు యూపీఐ సేవలను అందించేందుకు అనుమతి ఇస్తోంది. జొమాటో తరహాలో ఫ్లిప్కార్ట్ సైతం యూపీఐ సేవలు ప్రారంభించబోతోంది. చాలామంది ఇదివరకు జొమాటో లో ఆర్డర్ తీసుకోవడం కాష్ ఆన్ డెలివరీ పెట్టుకొని ఫుడ్ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వెంటనే క్యాన్సిల్ చేయడం లాంటివి చేశారు. అయితే ఇకపై అలాంటి అవకాశం ఉండదు.