Posani: తెలుగులో డైరెక్టర్ గా, రైటర్ గా, నటుడిగా, హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన సినీ ప్రముఖుడు పోసాని కృష్ణమురళి. ఎన్నో సినిమాలకు కథలు, మాటలు అందించిన పోసాని ఎంతోమంది కొత్త వారికి అవకాశాలు ఇప్పించారు. తెలుగు సినిమాలో ఇప్పుడు ఉన్న చాలామంది డైరెక్టర్లకు పోసాని లైఫ్ ఇచ్చారంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. అయితే తాజాగా పోసాని మురళీకృష్ణ ఓ డైరెక్టర్ గురించి సంచలన కామెంట్లు చేశారు.
టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా ఉన్న ఓ డైరెక్టర్ కు తాను లైఫ్ ఇస్తే, అతడు మాత్రం తన వంకర బుద్ధిని చూపించినట్లు పోసాని వెల్లడించాడు. తన ఊరికే చెందిన సదరు డైరెక్టర్.. తినడానికి తిండి కూడా లేకపోతే, అప్పట్లో పెద్ద డైరెక్టర్ గా ఉన్న ముత్యాల సుబ్బయ్య దగ్గర అడిగి మరీ పెట్టించినట్లు పోసాని తెలిపాడు. తినడానికి తిండి కూడా లేకపోతే ముత్యాల సుబ్బయ్యకు తాను కథలు రాసిన పరిచయంతో డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనికి పెట్టించినట్లు పోసాని తెలిపాడు.
అలాగే తినడానికి కూడా తిండి లేని సదరు డైరెక్టర్ ని.. తొలి సినిమా చేసేంత వరకు తీసి వెయ్యవద్దని, అతడి కడుపు కొట్టొద్దని కూడా తాను చెప్పినట్లు పోసాని తెలిపాడు. ఎన్నేళ్లైనా అతడు డైరెక్టర్ అయ్యే వరకు అండగా నిలవాలని కూడా చెప్పినట్లు పోసాని వివరించాడు. మొత్తానికి అతడు ఇప్పుడు ఓ స్టార్ డైరెక్టర్ అయ్యాడని.. కానీ డైరెక్టర్ అయ్యాక మాత్రం చాలా మారిపోయాడని, నమ్మక ద్రోహి అని పోసాని మండిపడ్డారు.
మరోపక్క తనకు జీవితాన్నిచ్చిన గురువులు, తన వద్ద పని నేర్చుకున్న శిష్యులు ఎంతో మంది తనకు వేషాలు ఇస్తున్నారని పోసాని తెలిపాడు. తెలుగులో ఎంతో టాప్ పొజిషన్ లో ఉన్న డైరెక్టర్లు తనకు ప్రత్యేకమైన క్యారెక్టర్లు ఇవ్వడం తన అదృష్టం అని పోసాని వెల్లడించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాథ్, వి.వి వినాయక్ లాంటి డైరెక్టర్ల దగ్గర తాను పని చేశానని, వాళ్లు మంచి మంచి క్యారెక్టర్లు ఇచ్చినట్లు పోసాని తెలిపాడు.