Varun Tej: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ప్రజలే కుటుంబ సభ్యులని, అప్పులు చేసి మరీ కౌలు రైతులకు సాయం చేస్తున్నారని సినీ నటుడు వరుణ్ తేజ్ అన్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే, ఆయనకు మద్దతుగా వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పిఠాపురం విచ్చేసిన ఆయనకు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. నాగబాబు, వరుణ్ తేజ్ ఇద్దరూ కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తర్వాత గొల్లప్రోలు మండలం తాడిపత్రి, కొడవలి, చెందుర్తి గ్రామాలలో బైక్ ర్యాలీ రోడ్డు షోలలో పాల్గొన్నారు. దుర్గాడ లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆయన డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదని, ప్రజాసేవ చేయడానికి వచ్చాడని తెలిపారు రాజకీయాలలోకి వచ్చిన తరువాతే తాను సంపాదించుకున్నది పోగొట్టుకున్నారని చెప్పారు.
ప్రజలకు మంచి చేయాలని రాజకీయాలలోకి వచ్చిన బాబాయికి ఆయన కుటుంబ సభ్యులుగా మేమందరం అండగా నిలిచేందుకే పిఠాపురం వచ్చాము. మా బాబాయి ఎంతో డబ్బు ఉన్నా అవన్నీ వదిలేసి ప్రజల కోసం వచ్చారు ఆయనను చూసి మేము చాలా గర్వపడుతుంటాము. మొన్న బాబాయ్ నామినేషన్ ర్యాలీ చూశాను దద్దరిల్లిపోయింది అని చెప్పుకొచ్చారు. ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్య ఉన్నారు ప్రజల కోసం పోరాడారు.
అలాంటి వ్యక్తిని ఈసారి గెలిపిస్తే నియోజకవర్గంని మరింత అభివృద్ధి చేస్తారు అందుకే ఆయనని గెలిపించండి అంటూ పిలుపునిచ్చారు వరుణ్ తేజ్. జాతీయ పార్టీ అధికార ప్రతినిధి కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కన్వీనర్ వి అజయ్ కుమార్, పార్టీ స్టార్ క్యాంపెయినర్ నటుడు సాగర్ బీజేపీ పిఠాపురం ఇన్చార్జి శ్రీ కృష్ణంరాజు, టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఇక పవన్ కళ్యాణ్ కి మద్దతుగా చిరంజీవి, రామ్ చరణ్ కూడా ప్రచారం చేస్తారని సమాచారం అందింది అయితే అధికారికంగా ఈ విషయం ఎవరూ ప్రకటించలేదు.