Actor shivaji: గరుడ పురాణం అంటూ గత ఎన్నికల ముందు హడావుడి చేసి చంద్రబాబుకి నమ్మిన బంటుగా, తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అంటూ ప్రచారం చేసి చివరికి రాజకీయ వర్గాల్లో కమెడియన్ గా మిగిలిపోయిన హీరో శివాజీ గత కొంతకాలంగా కనిపించడం మానేశారు. ఇప్పుడు మళ్లీ మీడియా ముందుకు వచ్చి కొత్త పురాణాలు చెప్తున్నారు.
ఈయన సినిమాల ద్వారా కన్నా ఇలాంటి స్టేట్మెంట్ల ద్వారానే ఎక్కువ పాపులర్ అయ్యారు. కానీ అవేవీ అయినా రాజకీయ భవిష్యత్తు కి పునాది వేయలేకపోయాయి. 2024 ఎన్నికల్లో ప్రజల మూడ్ ఎలా ఉందనే దానిపై సర్వే చేస్తున్నామని, 130 నియోజకవర్గాల్లో ఇంతవరకు ఎవరు చేయని విధంగా వినూత్న సర్వే చేస్తున్నామని అందుకే మీడియాకి దూరంగా ఉన్నామని చెప్పుకొచ్చాడు శివాజీ.
అందులో భాగంగానే ఉండవల్లి గురించి మాట్లాడుతూ ఆయన పేరుని కూడా పలకటానికి నేను ఇష్టపడను, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు, ఆయన ఎవరి కోసం పని చేస్తున్నారో అందరికీ తెలుసు అంటూ కామెంట్లు చేశారు. రామోజీరావు గారు తప్పు చేసి ఉంటే సరిదిద్దుకునేవారు అని ఇదే ప్రశ్న 32 కేసులు ఉన్నా కూడా సీఎంగా ఉన్నా జగన్ ని ఎందుకు ప్రశ్నించలేదని ఘాటుగా స్పందించారు శివాజీ.
రామోజీరావు గారు నిజంగా తప్పు చేసి ఉంటే అవి కోర్టులు డిసైడ్ చేస్తాయి. ఉండవల్లి గారు సింహాన్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, రామోజీరావు గారు విలువలతో బ్రతుకుతున్నారని చెప్పుకొచ్చారు శివాజీ. అప్పట్లో చంద్రబాబుకి విపరీతంగా భజన చేసిన ఈ నటుడు పవన్ కళ్యాణ్ ని తీవ్రస్థాయిలో విమర్శించాడు.
నేను సమాజాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లనని, మంచి ముసుగులో చెడు చేయాలనుకోను అని చెప్పిన శివాజీ తనని సీఎం జగన్ బెదిరించారని, నీ పని నువ్వు చూసుకో అంటూ వార్నింగ్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. జగన్ గారు చేస్తున్న తప్పులే ఆయనకి మైనస్ అవుతున్నాయని శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.