Assembly Elections: ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసిపోయాయి. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలు 25 లోక్ సభ స్థానాలకు సంబంధించిన నామినేషన్లు భారీగానే దాఖలయ్యాయి. 175 అసెంబ్లీ స్థానాలకి 3084 మంది అభ్యర్థులు 4265 సెట్ల నామినేషన్లు వేశారు. 25 లోక్ సభ స్థానాలకు 55 మంది అభ్యర్థులు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మిగిలిన నియోజకవర్గాల గురించి పక్కన పెడితే కొన్ని నియోజకవర్గాలలో జరగబోయే పోటీ గురించి అందరికీ ఆసక్తి నెలకొంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఆయన పరిస్థితి ఎలా ఉంది? పురంధరేశ్వరికి ఈసారి ఎన్నికలు కలిసి వస్తాయా? హిందూపురం నుంచి పోటీ చేస్తున్న బాలకృష్ణ ఈసారి హ్యాట్రిక్ సాధిస్తారా? మంగళగిరి ప్రజలు నారా లోకేష్ ని గతంలో ఓటమిపాలు చేశారు. ఈసారైనా విజయాన్ని అందిస్తారా? కుప్పం నియోజకవర్గం చంద్రబాబు కి ఎలాంటి తీర్పుని ఇస్తుంది..
ఈ అగ్ర నేతలు పోటీ చేసే స్థానాల్లో ఎంత మంది ప్రత్యర్థులు పోటీ చేస్తున్నారు అనే అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి స్థానం నుంచి 65 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆ తర్వాత వైయస్ షర్మిల బరిలో ఉన్న కడప లోక్సభ స్థానం నుంచి 42 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
ఆ తర్వాత పులివెందుల నుంచి 37 మంది నామినేషన్లు దాఖలు చేస్తే చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గ నుంచి 32 మంది నామినేషన్లు దాఖలు చేశారు. పురందరేశ్వరి మీద 22 మంది నామినేషన్ దాఖలు చేశారు. పిఠాపురం నుంచి 19 మంది హిందూపురం నుంచి 19 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఏప్రిల్ 29 నాటికి నామినేషన్ల ఉపసంహరణ ఆఖరి తేదీ కావడంతో ఎంతమంది ఉపసంహరించుకుంటారో తెలిస్తే అప్పుడు ఫైనల్ గా బరిలో ఎంతమంది ఉంటారు అన్నది తెలుస్తుంది.