Benefits of Squats: వినాయకుని గుడికి వెళ్ళిన వారు వినాయకుడికి నమస్కరించిన తర్వాత గుంజీలు తీస్తూ ఉంటారు. అయితే అలా గుంజీలు ఎందుకు తీస్తారు.. అలా తీయడం వెనుక ఉన్న కథ చాలామందికి తెలియదు. పార్వతి దేవికి మహావిష్ణువు సోదరుడు. అందుకే పార్వతీదేవిని నారాయణి అంటారు. మహా విష్ణువు ఒకసారి కైలాసానికి వెళ్ళినప్పుడు ఆయుధాలను తీసి పక్కన పెట్టి శివునితో కలిసి లోకాభిరామాయణం మాట్లాడుతూ ఉంటాడు.
అప్పుడే అక్కడికి బాలగణపతి వచ్చి స్వర్ణకాంతులతో దగదగలాడుతున్న సుదర్శన చక్రాన్ని తీసుకొని అమాంతం నోట్లో వేసుకొని మింగేస్తాడు. అయితే ఈ విషయాన్ని హరిహరులిద్దరూ గమనించరు. ఆ తరువాత తన ఆయుధాల కోసం చూసిన మహావిష్ణువు సుదర్శన చక్రం కనిపించకపోవడంతో వెతకడం ప్రారంభిస్తాడు అప్పుడే అక్కడికి వచ్చిన బాల గణేశుడు ఏం వెతుకుతున్నావు అని అడుగుతాడు. నా సుదర్శన చక్రం ఎక్కడ పెట్టానో మరిచిపోయాను దానినే వెతుకుతున్నాను అంటాడు. అప్పుడు బాల గణేశుడు నేను మింగేసాను కదా అంటాడు.
చక్రాన్ని తిరిగి ఇమ్మని బ్రతిమాలతాడు మహావిష్ణువు. బాలుడిని ప్రసన్నం చేసుకునేందుకు కుడిచేత్తో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకొని గుంజీలు చేయడం మొదలు పెడతాడు. విష్ణుమూర్తి గుంజీలు తీయడం విచిత్రంగా అనిపించడంతో విపరీతంగా నవ్వుతాడు బాల గణేశుడు. దాంతో సుదర్శన చక్రం నోటి నుంచి బయటపడుతుంది. దాంతో ఊపిరి పీల్చుకుంటాడు విష్ణుమూర్తి. అప్పటినుంచి వినాయకుడు ముందు గుంజీలు తీసి వేడుకుంటే ఏం కోరుకున్నా నెరవేరుస్తాడని భక్తుల విశ్వాసం.
ఎవరికైనా ఏదైనా కోరిక నెరవేరాలంటే వినాయకుడి దగ్గరికి వెళ్లి గుంజీలు తీస్తూ ఉంటారు. అలాగే గుంజీలు తీయడం అనేది శారీరకంగా కూడా చాలా మంచిది. ఇది మెదడుకి యోగ అని చెప్తున్నారు సైంటిస్టులు. దీనివల్ల బరువు తగ్గడంతో పాటు మానసిక సమస్యలు కూడా తగ్గుతాయి. పాత రోజుల్లో చదువులో వెనుకబడిన పిల్లలని గుంజీలు తీయించడానికి కారణం ఇదేనట. ఎందుకంటే గుంజీలు తీయడం వలన బ్రెయిన్ బాగా యాక్టివేట్ అవుతుందట, దాని వలన జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.