Brahmanandam: టాలీవుడ్ ప్రేక్షకులకు కమెడియన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బ్రహ్మానందం ఆతరం ఈతరం రెండు తరాల ప్రేక్షకులకు సుపరిచితమే. తన కామెడీతో కొన్ని కోట్లాదిమంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి స్టార్ కమెడియన్గా తనకంటూ ప్రత్యేకమైన చెరగని ముద్రను వేసుకున్నారు బ్రహ్మానందం. అంతే కాకుండా కొన్ని వందల సినిమాలలో నటించి రికార్డులు సృష్టించారు బ్రహ్మానందం. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రహ్మానందం తన జీవితంలో జరిగిన పలు సంఘటనల గురించి చెప్పుకొచ్చారు.
నా జీవితంలో జరుగుతున్నదేదీ నేను ముందుగా ఊహించలేదు. రెండు పూటలా తినడానికి కూడా ఆలోచించుకున్న రోజులు ఉన్నాయి. అటువంటిది ఎమ్ఏ చదివాను, లెక్చరర్ ఉద్యోగం చేశాను. ఊహించకుండా సినిమాల్లోకి వచ్చాను. ఇలా అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అంతకుముందు డబ్బు కోసం ఇబ్బందులు పడ్డాను. ఇప్పుడు మంచి స్థానంలోకి వచ్చాక పేరు కాపాడుకోవడానికి ఇబ్బంది పడుతున్నాను. ఎవరైనా సరే ఎదుటివారు బాగుండాలని కోరుకుంటారు. కానీ తమ కన్నా బాగుండాలని మాత్రం కోరుకోరు.
నేను స్టార్ హీరోలందరితోనూ పనిచేస్తూ ఎదుగుతున్నప్పుడు చాలామంది అసూయపడ్డారు. సుధాకర్ వచ్చాడు బ్రహ్మానందం పనైపోయింది, బాబూ మోహన్, ఎల్బీ శ్రీరామ్ వచ్చారు. ఇక బ్రహ్మీ పనైపోయినట్లే, పృథ్వీ వచ్చాడు బ్రహ్మీ వెనకబడిపోయాడు, ఇలా కొత్తగా ఏ కమెడియన్ వచ్చినా సరే నా పనైపోయింది అన్నారు. ఇవన్నీ దాటుకుంటూ ఇక్కడిదాకా వచ్చాను. రంగమార్తాండ సినిమాలో ఆ పాత్ర మీరు తప్ప ఇంకెవరు చేయగలరు మాస్టారు అని కృష్ణవంశీ అన్నారు.
నాకది చాలు అని చెప్పుకొచ్చాడు బ్రహ్మానందం. కాగా ఇంటర్వ్యూలో బ్రహ్మానందం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ కామెంట్లపై స్పందించిన పులువురు నెటిజన్స్ అభిమానులు పైకి నవ్వుతూ అందరిని నవ్వించే బ్రహ్మానందం కెరియర్ లో కూడా ఇన్ని అవకతవకలు ఉన్నాయా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.