ACB Raid: ఉచితంగా ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు లంచాలకు మరిగి పోలీసులకు చిక్కి కటకటాల పాలవుతున్నారు. తన పెళ్లి ఊరేగింపుతో బాగా పాపులర్ అయిన ఓ ప్రభుత్వ అధికారి ఇప్పుడు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ‘బుుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా’ అంటూ పెళ్లి బారాత్లో డ్యాన్స్ చేసి అలరించిన వధూవరులు అందిరకీ గుర్తుండే ఉంటారు. ఇప్పుడా ఆ పెళ్లికొడుకు ఏసీబీకి పట్టుబడి వార్తల్లో మరోసారి నిలిచాడు.
రంగారెడ్డి జిల్లా బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆకుల అశోక్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అల్మాస్గూడకు చెందిన దేవేందర్రెడ్డికి బడంగ్ పేటలో రెండు ప్లాట్లు ఉన్నాయి. వాటి నిర్మాణాల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అందుకోసం టౌన్ ప్లానింగ్ అధికారి అశోక్ ఒక్కొక్క ప్లాట్కు రూ.30 వేల చొప్పున రెండు కలిసి రూ.60 వేలు డిమాండ్ చేశాడు.
వారం క్రితం బాధితుడు దేవేందర్రెడ్డి నేరుగా అశోక్కు రూ.20 వేలు అందజేశాడు. మరో రూ.30 వేలు మంగళవారం సాయంత్రం ఇచ్చే ప్రయత్నం చేయగా.. ప్రైవేట్ డాక్యుమెంటరీ ప్లానర్ ఎర్రబట్టు శ్రీనివాస్ రాజుకు ఇవ్వండని అశోక్ సూచించాడు. దేవేందర్ రెడ్డి రూ.30 వేలను శ్రీనివాస్ రాజుకు ముట్టజెబుతుండగా ఏసీబీ అధికారులు రెడ్ హాండేడ్గా పట్టుకున్నారు.
ప్రైవేట్ డాక్యుమెంటరీ ప్లానర్ శ్రీనివాసరాజును సైతం అదపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ మేరకు బడంగ్ పేట్ కార్పొరేషన్లోని టౌన్ ప్లానింగ్ కార్యాలయంతో పాటు నాగోల్లోని అశోక్ ఇంటిపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. నిందితులిద్దరినీ ఏసీబీ కోర్టులో హాజరుపరిచి చంచల్గూడ జైలుకు తరలించినట్లు ఏసీబీ డీఎస్సీ సూర్యనారాయణ తెలిపారు. బుల్లెట్బండితో పాటతో ఫేమస్ అయిన అశోక్ తీరుపై స్థానిక ప్రజలు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.