Chattisgarh: ఇటీవల కాలంలో సమాజంలో మానవత్వం మంట కలిసిపోయింది. సమాజంలో జరిగే అన్ని రకాల సంఘటనలు చూస్తే అసలు వీళ్ళు మనుషులేనా అన్న అనుమానం కూడా రాక మానదు. కన్నీళ్లు తెప్పించే ఘటనలు ఇప్పటికే ఎన్నో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ఛత్తీస్గడ్ లో కూడా అటువంటి దారుణమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాలో ఓ తండ్రి ఏడాదిన్నర బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం 70 కిలోమీటర్లు బైక్పై తీసుకువెళ్లాడు.
స్థానికంగా అంబులెన్సు సమకూర్చకపోవడం ఈ హృదయ విదారక ఘటనకు దారితీసింది. వికాస్ఖండ్ మండలంలోని అడ్సేనా గ్రామంలో రామ్యాదవ్ దంపతులు నివసిస్తున్నారు. రామ్యాదవ్ భార్య కుమారుణ్ని పొలానికి తీసుకువెళ్లింది. ఆమె పనుల్లో నిమగ్నమై ఉండగా బాలుడు ఆడుకొంటూ ప్రమాదవశాత్తు సమీప చెరువులో మునిగిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని బయటకు తీసి హూటాహుటిన పీహెచ్సీకి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు ప్రకటించిన వైద్యులు పోస్టుమార్టం తప్పనిసరి అని చెప్పారు. దీనికి 70 కి.మీ.ల దూరంలో ఉన్న జిల్లా ఆస్పత్రికి మృతదేహాన్ని తీసుకువెళ్లాలి.
తమ వద్ద అంబులెన్సు లేదని, సొంత ఏర్పాట్లు చేసుకొని వెళ్లాలని వారు చెప్పడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న రామ్యాదవ్ కుమారుడి మృతదేహాన్ని ప్లాస్టిక్ కవరులో చుట్టి స్నేహితుడి సహాయంతో బైక్పై జిల్లా ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా వైద్యాధికారి ఎస్.ఎన్.కేసరి నిర్లక్ష్యంగా వ్యవహరించిన పీహెచ్సీ సిబ్బందిపై కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పిహెచ్ సీ సిబ్బందిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు..