Bhupesh Baghel: తాజాగా ఛత్తీస్గఢ్ లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు మాటువేసి మందుపాతర పేల్చి 10 మంది జవాన్లను బలి తీసుకున్న ఘటన ఒక్కసారిగా భారత ప్రజలను తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనతో పదిమంది జవాన్ల ఇండ్లలో ఒక్కసారిగా విషాదాలు చోటు చేసుకున్నాయి. దానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అసలేం జరిగిందంటే.. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా బుధవారం ఉదయం డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డు జవాన్లు కూంబింగ్ నిర్వహించారు. ఆ తరువాత మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో వారు మినీ బస్సులో తిరుగు పయనం అయ్యారు.
అయితే అప్పటికే జవాన్ లపై దాడి చేయడం కోసం అరన్పుర్ సమేలీ మధ్యలో ప్రధాన రహదారికి సమీపంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు మాటు వేశారు. ఇక భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకోగానే రోడ్డు మధ్యలో అమర్చిన ఐఈడీ బాంబులను పేల్చారు. ఈ పేలుడు దాటికి మినీ బస్సు తునాతునకలైంది. రోడ్డుపై నుంచి దాదాపు 10 అడుగుల లోతు గొయ్యి లో పడింది. బస్సులోని 10 మంది డీఆర్జీ జవాన్లు అక్కడికక్కడే అసువులు బాశారు. డ్రైవరు కూడా తీవ్ర గాయాలతో మృతి చెందారు. ఇది ఇలా ఉంటే తాజాగా గురువారం ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ మృతులకు ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సీఎం ఒక శవపేటికను మోశారు. జవాన్ల మృతదేహాలను ఒక వాహనంలో వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు. ఆ వాహనం వరకు ఆయన దానిని తీసుకెళ్లారు. అయితే జవాన్ల మృతదేహాలను శవపేటికలో మోసుకెళ్తున్న సమయంలో పక్కనే ఉన్న కుటుంబ సభ్యుల ఆవేదన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. ఆ కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. ఒకవైపు కుటుంబ సభ్యుల వేదనలు ఆకాశాన్ని అంటుతుండగా మరొకవైపు
భారత్ మాతాకీ జై అన్న నినాదాలు వినిపిస్తున్నాయి. ఆ శవపేటికలను స్వస్థలాలకు తరలించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జవాన్ల త్యాగాలు వృథాగా పోవు. మావోయిస్టులను మట్టుపెట్టేందుకు జరుపుతోన్న పోరును మరింత తీవ్రం చేస్తాం అని ఆయన వెల్లడించారు.