Cricket: మరో రెండు రోజుల్లో కొత్త ఏడాదికి స్వాగతం పలకబోతున్నాం. నూతన సంవత్సరంలో టీమిండియా విశ్వవిజేతగా నిలవాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్లో గొప్ప ప్రదర్శన చేయాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా రిజర్వ్ బెంచ్ కూడా బలంగానే ఉంది. అయితే ఏ ఆటగాడు ఏ ఫార్మాట్ ఆడుతున్నాడో తెలియని గందరగోళ పరిస్థితి టీమిండియాలో నెలకొంది.
ఇటీవల వన్డే జట్టును నడిపించిన ధావన్ను కొత్త ఏడాదిలో శ్రీలంకతో జరిగే వన్డేలకు పక్కనపెట్టారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో రెగ్యులర్ వికెట్ కీపర్ పంత్ను కూడా సెలక్టర్లు ఎంపిక చేయలేదు. అటు గతంలో టీ20లకు కాకుండా వన్డేలకు సంజు శాంసన్ను ఎంపిక చేసిన సెలక్టర్లు ప్రస్తుతం అతడిని వన్డేలకు కాకుండా టీ20లకు ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే ప్రపంచకప్లో టీమిండియా రాణించాలంటే ఇద్దరు ఆటగాళ్లు కీలకమని వెటరన్ ఆటగాడు దినేష్ కార్తీక్ చెప్పాడు.
భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియాను కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా నడిపించనున్నారని దినేష్ కార్తీక్ జోస్యం చెప్పాడు. ప్రపంచకప్ జట్టుకు తప్పకుండా రోహిత్కు డిప్యూటీగా పాండ్యానే ఉంటాడని అతడు స్పష్టం చేశాడు. అందుకే శ్రీలంకతో టీ20 సిరీస్కు కెప్టెన్గా ఎంపిక అయిన హార్దిక్ పాండ్యా.. వన్డే ఫార్మాట్లో వైస్ కెప్టెన్సీ అందుకున్నాడని దినేష్ కార్తీక్ అన్నాడు.
రోహిత్ తర్వాత కెప్టెన్సీ పాండ్యాకే
పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పటికే తానెంటో నిరూపించుకున్నాడని దినేష్ కార్తీక్ అన్నాడు. ఐపీఎల్లో గుజరాత్ను విజేతగా నిలిపాడని గుర్తుచేశాడు. అందుకే రోహిత్ శర్మ తర్వాత వైట్బాల్ క్రికెట్కు నాయకుడిగా అయ్యే అవకాశాలు కేఎల్ రాహుల్ కంటే హార్దిక్ పాండ్యాకే ఎక్కువగా ఉన్నాయన్నాడు. ఇప్పటికే వైస్ కెప్టెన్సీ రేసులో కేఎల్ రాహుల్తో పాండ్యా పోటీ పడుతున్నాడని.. అయితే అదే సమయంలో ఫామ్లో ఉండటం కూడా ముఖ్యమన్నాడు. ప్రస్తుతానికి పాండ్యా ప్రదర్శన కూడా అత్యుత్తమ స్థాయిలో ఉందని ప్రశంసించాడు.