Tirupati Devasthanam: ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం అయిన తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ నూతన చైర్మన్ గా కొత్త పేరు ప్రచారంలోకి వస్తుంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తన బాబాయి వై.వి సుబ్బారెడ్డి కి ఈ పదవిని అప్పగించారు. అయితే ఇప్పటికే ఆయన రెండుసార్లు ఈ పదవిని చేపట్టారు. తర్వాత ఉత్తరాంధ్ర వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ గా కూడా బాధ్యతలు అప్పగించారు.
దీనివలన ఆయన పూర్తిస్థాయిలో రాజకీయాల మీద ఫోకస్ చేయవలసి ఉంటుంది. అందువల్ల ఈసారి ఈ పదవి కి వేరొకరిని ఎంపిక చేస్తారనే ప్రచారం నడుస్తోంది. అయితే ఈ కీలకమైన పదవికి మూడు పేర్లు జగన్ టేబుల్ మీద ఉన్నాయని వైసీపీ సర్కిల్స్ లో చర్చ మొదలైంది. మొదటిది గుంటూరు జిల్లాకు చెందిన బీసీ నేత ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. రెండవది మాజీ మంత్రి యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు. మూడవది పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి పేరు వినిపిస్తుంది.
వీరిలో కృష్ణమూర్తికే ఈ పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని జోరుగా ప్రచారం సాగుతుంది దానికి కారణం కూడా లేకపోలేదు ఎందుకంటే పార్థసారధి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు కాబట్టి తను ఈ పదవి ఆశించడం లేదని సమాచారం. ఇక ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి రెండుసార్లు ఈ ఛాన్స్ వచ్చినందువల్ల రెడ్డిలకు అవకాశం ఉండబోదు అని వైసిపి పెద్దలు చెబుతున్నారు. ఇక కృష్ణమూర్తి విషయానికి వస్తే ఈయనకి బీసీ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి.
ఎన్నికలవేళ సామాజిక సమీకరణల దృష్ట్యా ఆయనను ఎంపిక చేస్తే బాగుంటుందని జగన్ కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ రేసులోకి కొత్తగా భూమన కరుణాకర్ రెడ్డి కూడా వచ్చారు. ఎందుకంటే ఈ ఎన్నికలలో ఆయన పోటీ చేయాలనుకోవడం లేదు టికెట్ ని ఆయన కుమారుడికి ఇవ్వాలని కోరుతున్నారు. ఈయన జగన్ కి అత్యంత సన్నిహితుడు మరియు ఇంతకుముందు ఒకసారి టీటీడీ చైర్మన్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. మరి జగన్ ఎవరికి ఓటేస్తారో తెలియాలంటే ఆగస్టు వరకు ఆగాల్సిందే.