Task Force: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. తవ్వికొద్ది గుట్టలకొద్ది సరికొత్త కోణాలు బయటపడుతున్నాయి. కేసులో కీలకంగా మారిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావును విచారణ చేసిన అధికారులకు విస్తుపోయే విషయాలు తేలాయి. రాధాకిషన్ BRS పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని అధికారులు గుర్తించారు. ఎన్నికల వేళ ఆ పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చడం కోసం తన బృందాన్ని రంగంలోకి దింపారు. ఈ క్రమంలో ఏకంగా టాస్క్ఫోర్స్ వాహనాల్లోనే డబ్బు తరలించినట్లు గుర్తించారు. హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాల్లోని అభ్యర్థులకు డబ్బు పంపడంలో ఈయన కీలకంగా వ్యవహరించారు. పోలీసు వాహనాలైతే అనుమానం రాదనే ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేశారు.
రాధాకిషన్ టీంలో పనిచేసిన మరో నలుగురు టాస్క్ఫోర్స్ పోలీసులను అధికారులు విచారణ జరుపుతున్నారు. దీంతో మరిన్ని మరికొందరి అరెస్టులు జరిగే అవకాశముంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం రాధాకిషణ్ చంచల్గూడా జైలులో ఉన్నారు. చంచల్గూడ జైల్లో జ్యుడిషియల్ రిమాండులో ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను హైదరాబాద్ పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. మొదటిరోజు కస్టడీలో 6 గంటలు మాత్రమే విచారించినట్లు తెలుస్తోంది. మరోవైపు అదుపులోకి తీసుకున్న రాచకొండ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ గట్టుమల్లు నుంచి వాంగ్మూలం తీసుకున్న అనంతరం వదిలేశారు. రాధాకిషన్రావు బృందం ప్రధాన పార్టీ నాయకులపై పోటీచేసే ప్రత్యర్థుల్ని కట్టడి చేయడంలోనూ కీలకంగా వ్యవహరించింది. దీని కోసం ముందుగా పలువురు నేతలు, వ్యాపారుల ప్రొఫైళ్లు రూపొందించి ఎస్ఐబీ కార్యాలయంలో ప్రణీత్రావుకు ఇచ్చేవారు. కదలికలు, కార్యకలాపాలపై సాంకేతిక సాయంతో రహస్యంగా సమాచారం సేకరించిన ప్రణీత్… తిరిగి రాధాకిషన్రావుకు చేరవేసేవారు. దీని ఆధారంగా రాధాకిషన్రావు బృందం క్షేత్రస్థాయిలో ఆపరేషన్లు చేపట్టి ప్రధాన పార్టీ ప్రత్యర్థుల్ని కట్టడి చేయడంపై దృష్టి సారించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన భుజంగరావు సైతం అదే పార్టీకి ప్రయోజనం చేకూర్చేందుకు ప్రైవేటు ప్రొఫైళ్లు రూపొందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో రాధాకిషన్రావుకు కోర్టు కస్టడికి అప్పగించింది.
మరోవైపు ఈకేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. హైదరాబాద్కు SIB చీఫ్ ప్రభాకర్రావు రానున్నారు. ట్యాపింగ్ కేసు వెలుగులోకి రావడంతో అమెరికాకు పరారీ అయిన ఆయనపై ఇప్పటికే లుక్ఔట్ నోటీసులు జారీ చేసింది పోలీసుశాఖ. ఈ కేసులో ప్రభాకర్రావు విచారణ ఎంతో కీలకం కానుంది. ప్రభాకర్రావు ఆదేశాలతో ట్యాపింగ్ చేశానని విచారణలో ప్రణీత్రావు అంగీకరించారు. మరి ప్రభాకర్రావుకు ఆదేశాలు ఇచ్చింది ఎవరనేది విచారణలో తేలనుంది.