Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర స్థాయిలో కలకలం రేపుతుంది ముఖ్యంగా నల్గొండ జిల్లాలో టాస్క్ ఫోర్స్ లో ఉన్నటువంటి ముగ్గురు పోలీస్ అధికారులు సైతం ఇలా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడి భారీ స్థాయిలో బాధితులను వేధింపులకు గురిచేసి సొమ్ము చేసుకున్నారని విషయం వెలుగులోకి వచ్చి ఒక్కసారిగా అందరూ ఖంగుతిన్నారు.
ఇప్పటికే నల్గొండ జిల్లాలో టాస్క్ ఫోర్స్ లో పనిచేసినటువంటి ముగ్గురు పోలీస్ అధికారులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అప్పటి జిల్లా అధికారితో ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ పై ఎన్నికలలో భాగంగా పెద్ద ఎత్తున డబ్బు పంపిణీతో పాటు వ్యాపారుల ఫోన్లు అన్నిటిని కూడా ట్యాపింగ్ చేశారు. టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన పలువురు కింది స్థాయి అధికారులకు పెద్ద ఎత్తున దందాలకు, సెటిల్మెంట్లకు తెర లేపారని తెలుస్తోంది.
నార్కట్ పల్లి వద్ద దొరికిన గంజాయి కేసులో వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. ఇక పేకాట బియ్యం బస్తాల దందాలు చేసే వారి ఫోన్లను కూడా ట్యాప్ చేసి మరి బెదిరింపులకు పాల్పడుతున్నారు. వీరు మాత్రమే కాకుండా పార్కులో తిరిగే ప్రేమ జంటలు అలాగే ఏదైనా కేసు నిమిత్తం పోలీసులను ఆశ్రయించి వచ్చినటువంటి కుటుంబాలలోని మహిళలను టార్గెట్ చేస్తూ వేధింపులకు గురి చేశారు.
పోలీస్ అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడంతో ఓ పోలీస్ అధికారి ఏకంగా గుర్రంపోడు మండల సమీపంలో తొమ్మిది ఎకరాల తోటను కొనుగోలు చేయటం గమనార్హం. ఈ విషయాలన్నింటినీ కూడా పోలీసులు దర్యాప్తులో బయటపెట్టారు. అయితే ఈ దర్యాప్తులో భాగంగా మరికొన్ని విస్తు పోయే నిజాలు వెలుగులోకి రాబోతున్నాయని కూడా తెలుస్తుంది.