Nithiin నితిన్, కృతి శెట్టి జంటగా రాజశేఖర్ రెడ్డి దర్వకత్వంలో తెరకెక్కిన చిత్రం మాచర్ల నియోజకవర్గం. భారీ అంచనాలతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అనుకున్న ఫలితాన్ని నమోదు చేయలేకపోయింది. దీనికి ప్రధాన కారణం చిత్ర దర్శకుడు రాజశేఖర్ రెడ్డి అనే చెప్పాలి.
సినిమా విషయం కాసేపు పక్కన పెడితే..దర్శకుడు కాకముందు రాజశేఖర్ రెడ్డి చేసిన కొన్ని తప్పులు ఇప్పుడు ఈ సినిమాని బలి చేశాయి. తన కమ్యూనిటీపై తనకున్న వీరాభిమానంతో ఒకప్పుడు ఇతర వర్గాలను కించపరిచేలా తను చేసిన ట్వీట్లు సినిమా విడుదలకు ముందు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన కులాలను దూషిస్తూ అప్పుడు ఆయన చేసిన ట్వీట్లు నెట్టింట్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో ఆ రెండు వర్గాలకు చెందిన చాలా మందికి దర్శకుడు శత్రువుగా మారాడు. ఆ రెండు వర్గాలకు చెందిన చాలా మంది సినిమా విడుదలకి ముందు నుంచి నెగటివ్ పబ్లిసిటీ ప్రారంభించారు.
అయితే ఈ విషయాన్ని గ్రహించిన హీరో నితిన్ సైతం ఆ ట్వీట్లు దర్శకుడు రాజశేఖర్ రెడ్డివి కాదని, అది ఫేక్ అకౌంట్ అంటూ చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే నెట్టింట్లో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో సినిమా విడుదలకు ముందు నుంచే ఈ చిత్రంపై పలువురు ఆగ్రహంతో రగిలిపోయారు. దీనికి తోడు దర్శకుడు సైతం సినిమాలో తన కమ్యూనిటీని అన్ని చోట్ల హైప్ చేసే ప్రయత్నం చేశాడు. ఇక తగ్గేదేలే అన్నట్లుగా పలువురు తమకు నచ్చినట్లుగా నెగటివ్ పబ్లిసిటీ చేసి ఆగ్రహాన్ని వెళ్ళబుచ్చారు.
దీంతో ఈ సినిమాకి నెగటివిటీ తీవ్రంగా స్ప్రెడ్ అయింది. ఈ వ్యవహారంలో హీరో నితిన్ బలైపోయాడు. నితిన్ ఎప్పట్నించో పవన్ కల్యాణ్ అభిమాని అవడంతో పవన్ ఫ్యాన్స్ నితిన్ సినిమాలను ప్రోత్సహించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనబడటం లేదు.