Speaker Tammineni: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు వేడి వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటాయి. ఏదో ఒక వివాదం పై అధికారపక్షం ప్రతిపక్షం మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది. అయితే ఏపీలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెద్ద ఎత్తున రాజధాని గురించి వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా ప్రకటించారు.అయితే తాజాగా అధికారంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అమరావతి రాజధాని కాదని మూడు ప్రాంతాలను రాజధానిగా చేయాలంటూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలోనే రాజధాని విషయంలో అమరావతి రైతులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు వ్యక్తం చేశారు. ఇకపోతే తాజాగా అమరావతి రాజధానిగా ఉండాలంటూ అమరావతి రైతులు ఏకంగా పాదయాత్ర కూడా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాజధాని విషయంలో తాజాగా స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అన్న వారిని జిల్లా పొలిమేరల వరకు తరిమి కొట్టండి అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే ఉత్తరాంధ్ర జిల్లాలు మరొక అగ్నిగుండంలా మారుతాయని ఈయన తెలియజేశారు.రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయడానికి ముఖ్యమంత్రి గారు మూడు ప్రాంతాలను రాజధానులుగా ప్రకటించారని తెలిపారు.
ఈ విధంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలని, అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి విశాఖను ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా చేయడంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవంటూ ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.