Bobbili Constituency: గత మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ బొబ్బిలిలో జెండా ఎగరవేయాలని చూస్తోంది కానీ ఎందుకో ఆ నియోజకవర్గం తెలుగుదేశానికి పెద్దగా కలిసి రావటం లేదు. 1983లో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత తొలి ఎన్నికలలో బొబ్బిలిలో విజయాన్ని సాధించింది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత 1985లో రెండవసారి విజయాన్ని సాధించింది. ఆ తరువాత 1989 ఎలక్షన్స్ లో ఓడిపోయినప్పటికి తిరిగి 1994 లో తిరిగి విజయాన్ని దక్కించుకుంది.
ఆ తరువాత ఇప్పటివరకు ఒకసారి కూడా ఆ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచిందే లేదు. బొబ్బిలిలో బీసీ వెలమలు, ఓసి వెలమలు ఉన్నారు. ఓసి వెలమలు సామాజిక వర్గానికి చెందిన బొబ్బిలి రాజులు వైసీపీలో, కాంగ్రెస్ లో ఉన్నప్పుడు గెలిచారు. కానీ 2019లో తెలుగుదేశం తరపున పోరాడినప్పుడు మాత్రం ఓటమిపాలయ్యారు. అయితే ఈసారి పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉందని విజయనగరం జిల్లాలో తెదేపా కళ్ళు మూసుకొని గెలిచే సీటు బొబ్బిలి అని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
అయితే బొబ్బిలిలో అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సంపంగి చిన అప్పల నాయుడు మళ్లీ ఇదే పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. దాంతోపాటు భాజపా సీనియర్ నేత పెద్దింటి జగన్మోహనరావు కూడా వైసీపీలో చేరడంతో ఆ పార్టీకి మరింత బలం పుంజుకున్నట్లు అయింది. రాజులను గెలిపిస్తే కోటకే పరిమితం అవుతారు చిన్న అప్పలనాయుడుని గెలిపిస్తే జనంలో ఉంటారని ప్రచారం చేస్తున్నారు వైసీపీ వర్గం వారు.
అయితే గతంలో సంజయ్ కృష్ణ రంగారావుకు టికెట్ ఇచ్చిన తెదేపా ఈసారి ఆయన తమ్ముడు బేబీ నాయనని రంగంలోకి దించుతుంది. ఆయన మున్సిపల్ ఎన్నికలలో కూడా గట్టిగా పోరాడారు అందుకే ఈసారి బొబ్బిలిలో తెదేపా విజయం ఖాయమని బొబ్బిలి రాజులు గట్టిగా నమ్ముతున్నారు. మరి ఎవరి నమ్మకం నిజం అవుతుందో ఏ పార్టీ బొబ్బిలి కోట మీద జెండా ఎగురవేస్తుందో తెలియాలంటే ఎన్నికల ఫలితాలు రావాల్సిందే.