Shiva Lingam: సాధారణంగా మనం ఏ శివాలయానికి వెళ్లిన శివలింగం చాలా చిన్నగా కనపడుతుంది. కానీ మీరు ఎప్పుడైనా ఏకంగా 18 అడుగుల ఉన్నటువంటి శివలింగాన్ని చూసారా. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం.భైరవేశ్వరుడి ఆలయంలోని కొలువై ఉన్నటువంటి శివలింగం ఏకంగా 18 అడుగులు ఉంది. ఈ శివలింగాన్ని దర్శించుకోవాలంటే రెండు భాగాలుగా దర్శించుకోవాల్సి ఉంటుంది. మరి ఈ భైరవేశ్వరుడి ఆలయం ఎక్కడ ఉంది.. ఈ ఆలయ విశిష్టత ఏమిటి అనే విషయానికి వస్తే…
ఉమ్మడి కడప జిల్లా వేముల మండలంలోని మోపూరులో ఉండే ఈ భైరవేశ్వరుడు సాక్షాత్తు శివుడి అంశంగా ఇక్కడ కొలువై ఉన్నారని భావిస్తారు. ఈ ఆలయంలో స్వామి వారి లింగం ఏకంగా 18 అడుగులు ఉంది. ఈ లింగానికి కింద భాగంలో అర్చనలు చేయగా, పై భాగంలో అభిషేకాలు నిర్వహిస్తారు.ఇక్కడ స్వామి వారు స్వయంబుగా వెలిసారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయానికి వచ్చి మనం ఏదైనా కోరికలు కోరుకొని స్వామివారికి అభిషేకం చేస్తే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భావిస్తారు.
పురాణాల ప్రకారం భస్మాసురుడు ఒకరోజు ఘోరమైన తపస్సు చేసే శివుడి అనుగ్రహం పొందుతారు. ఏం వరం కావాలో కోరుకో అని పరమేశ్వరుడు చెప్పడంతో భస్మాసురుడు తను చేయి వేస్తే ఎవరైనా భస్మం కావాలని అలాంటి వరం తనకు కావాలని వేడుకుంటారు. ఈ వరం ఇచ్చినటువంటి శివుడి పైనే భస్మాసురుడు తన వర ఫలితాన్ని ప్రయోగిస్తారు. ఆ సమయంలో శివుడు మహావిష్ణువు సహాయం కోరుతారు.
విష్ణువు మోహిని అవతారంలో వచ్చి భస్మాసురుడిని సంహరిస్తుంది. అలా మోహిని పరమశివుడి అంశతో బైరవేశ్వరుడు జన్మించి ఇక్కడ స్వయంభుగా వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి.ఇక ఈ ఆలయం చుట్టూ నది ప్రాంతం ఉండగా మధ్యలో కొండపై ఆలయం వెలిసింది. ఇక ఇక్కడ స్వామివారిని దర్శించి ఏదైనా కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయని భావిస్తారు అందుకే పెద్ద ఎత్తున ప్రజలు ఈ ఆలయానికి తరలివస్తూ ఉంటారు.