Free Rice: కర్ణాటకలోని సిద్దరామయ్య సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్యభాగ్య పథకంలో భాగంగా బియ్యానికి బదులుగా డబ్బులు పంపిణీ చేస్తామని సంచలన ప్రకటన చేసింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఐదు కీలకమైన హామీల్లో అన్నభాగ్య పథకం కూడా ఒకటి. ఖాతాదారులకు 5 కిలోల చొప్పున అదనంగా బియ్యాన్ని పంపిణీ చేస్తామని కాంగ్రెస్ నాయకత్వం హామీ ఇచ్చింది.
ఈ అన్నభాగ్య పథకాన్ని అమలు చేసేందుకు అదనంగా ధాన్యాన్ని సేకరించాల్సి ఉంటుంది. కానీ బియ్యం సేకరణ సాధ్యం కావడం లేదు. మరో వైపు జులై 1 నుంచి అన్నభాగ్య పథకాన్ని అమలులోకి తీసుకువస్తామని సిద్ద రామయ్య ప్రభుత్వం ప్రకటించింది. ఉచితంగా అందిస్తామన్న అదనపు 5 కిలోల బియ్యానికి బదులు అందుకు సమానమైన మొత్తం డబ్బును బీపీఎల్ ఖాతాదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు అక్కడి సర్కారు తెలిపింది.
ఇవాళ కర్ణాటక మంత్రి వర్గం సమావేశం అయ్యింది. కేబినెట్ భేటీ నిర్ణయాలను రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి కేహెచ్ మునియప్ప వెల్లడించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం కిలో బియ్యానికి ప్రామాణిక ధర రూ. 34 ఉంది. రాష్ట్రానికి బియ్యం సరఫరా చేసేందుకు ఏ సంస్థ ముందుకు రాలేదని అన్నారు. బియ్యం అందుబాటులోకి వచ్చేంత వరకు.. కిలో బియ్యానికి రూ. 34 చొప్పున డబ్బు ఇస్తామన్నారు.
జులై 1 నుంచి ఈ నగదు నేరుగా బీపీఎల్ ఖాతాదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని పేర్కొన్నారు. ఒక రేషన్ కార్డులో ఒక వ్యక్తి ఉంటే నెలకు రూ.170 వస్తాయని, అదే ఇద్దరు వ్యక్తులు ఉంటే రూ. 340 వస్తాయని చెప్పారు. అలాగే ఒక రేషన్ కార్డులో ఐదుగురు వ్యక్తులు ఉంటే నెలకు రూ. 850 ను ఖాతాల్లో జమ చేస్తామని కేహెచ్ మునియప్ప తెలిపారు. ఈ పథకం అములను వాయిదా వేయకుండా అలాగే జనాలకు ఇచ్చిన హామీని నెరవేర్చేలా బియ్యానికి బదులు డబ్బులు ఇవ్వాలన్న నిర్ణయం తీసుకుంది.