Twitter : ఈ మధ్య వాట్సప్ సేవలు నిలిచిపోవడంతో అందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ట్విట్టర్ వంతు వచ్చింది. శుక్రవారం కొంత సమయం ట్విట్టర్ సేవలకు అంతరాయం కలిగింది. దీంతో రెగ్యులర్గా ఈ యాప్ను వాడే యూజర్స్ అంతా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై ట్విట్టర్ నుండి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఏం జరిగింది ?
అయితే ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏమిటంటే కేవలం వెబ్ యూజర్లకు మాత్రమే ఈ అసౌకర్యం కలిగింది. మొబైల్ ఫోన్స్లో యాధావిధిగా ట్విట్టర్ సేవలు కొనసాగుతున్నాయి. వెబ్లో బ్రౌజింగ్ చేసేవారికి మాత్రమే సమస్యలు తలెత్తినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్ యూజర్లకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేసిన తర్వాత ఆ సంస్థలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ సమయంలో ట్విట్టర్ సేవల్లో అంతరాయం ఏర్పడడంతో అందరూ దీనిపై చర్చించుకుంటున్నారు.
ఎలాన్ మస్క్ ట్విటర్ను హ్యాండ్ ఓవర్ చేసుకున్న తరువాత కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఆయన ఈ సంస్థను కొనుగోలు చేయక ముందు నుంచే మస్క్ బాస్ అయితే ట్విటర్లో ఉద్యోగుల తొలగింపు భారీగా ఉంటుందంటూ చాలా నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే మస్క్ ఈ వార్తలను ఖండించారు. కానీ ఆయన నిర్ణయాలు మాటల వరకే అని తేటతెల్లమయ్యింది.
దాదాపు 3700మంది ఉద్యోగులను ఉన్నపళంగా ఆయన తొలగించారు. ఈ వారం ముగిసే సమయానికి ఈ సంఖ్య వేలల్లో ఉంటుందని వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పుడు ఉద్యోగుల తొలగింపుతోపాటు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కూడా ఎత్తివేసే దిశగా మస్క్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది జూన్ నెలలో వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో టెస్లా ఉద్యోగులకు మస్క్ ఒక వార్నింగ్ ఇచ్చారు. అదే తరహాలో ట్విటర్ ఉద్యోగులకు కూడా ఆఫీస్కు రమ్మని ఆదేశిస్తారని ఆ కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి.