Soundarya: అలనాటి అందాల తార స్వర్గీయ సౌందర్య అందరికీ గుర్తుకు ఉండే ఉంటుంది. ఇప్పటివరకు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించింది. 12 ఏళ్ల సినీ ప్రస్థానంలో 100కుపైగా సినిమాల్లో నటించింది. అయితే సౌందర్య అసలు పేరు సౌమ్య. సినీ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత సౌందర్యగా మార్చుకుంది. 1992లో ‘గంధర్వ’ సినిమాలో నటించింది. ఆ తర్వాత ‘అమ్మోరు’ సినిమా చేసింది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అంతగానో ఆకట్టుకుంది. చదువును మధ్యలోనే ఆపేసి టాలీవుడ్లోనే ప్రవేశం చేసింది. టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చింది. సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్తో కలిసి ‘సూర్యవంశ్’ సినిమాలో నటించింది. 2004 ఏప్రిల్ 17న బీజేపీ మద్దతు పలుకుతూ ఏపీకి ప్రసంగించడానికి బయలుదేరినప్పుడు విమాన ప్రమాదంలో మరణించింది.
సౌందర్య.. తన బాల్య స్నేహితుడు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన జీఎస్.రఘును వివాహం ఆడింది. అయితే సౌందర్య పెళ్లి జరిగిన ఏడాదికే ఆమె మరణించింది. దీంతో రఘు పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. అయితే అతను కోలుకోవడానికి ఎంతో సమయం పట్టిందట. ఆ తర్వాత రఘు 2011లో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత గోవాకు వెళ్లి సెటిల్ అయ్యారు. అయితే సౌందర్య ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లు ప్రస్తుతం పాడుబడ్డ బంగ్లాగా మారింది. కాగా, ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ సరసన రాజా, జయం మనదేరా, పెళ్లి చేసుకుందాం, పవిత్ర బంధం వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించారు. పన్నెండేళ్ల అచిరకాలంలోనే సౌందర్య ఆరు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలను అందుకుంది. అమ్మోరు, అంతఃపురం, రాజా, ద్వీప, ఆప్తమిత్ర వంటి సినిమాకు ‘ఉత్తమ నటి, ఉత్తమ నిర్మాత విభాగాల్లో 2 పురస్కారాలు’ వచ్చాయి. అలాగే రాష్ట్రప్రభుత్వం నుంచి మూడు ప్రతిష్టాత్మక నంది పురస్కారాలు అందుకుంది. సౌందర్య తన నటన, అభినయంతో అభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. ఆమె నటించిన సినిమాల వల్లే సౌందర్యను రెండు రాష్ట్రాల ప్రజలు తెలుగింటి ఆడపడుచుగా ఆదరిస్తారు.