Volunteers on YSRCP Manifesto: వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోని చూసి సాధారణ ప్రజలే కాదు ఆయన కోసమే పని చేసిన గ్రామ వాలంటీర్లు కూడా జగన్ అన్యాయం చేశాడని గగ్గోలు పెడుతున్నారు సదరు గ్రామ వాలంటీర్లు. గత నాలుగున్నర ఏళ్లుగా ఐదు వేలు జీతం ఇస్తున్న జగన్ ప్రస్తుత మేనిఫెస్టోలో తనకి ఒక్క రూపాయి కూడా జీతం పెంచుతామని ప్రస్తావించకపోవడంతో వాలంటీర్ల ముఖాలు తెల్లబోయాయి. నెలకు 5000 జీతం అంటే సగటున రోజుకి 165 రూపాయలు. ఈ మొత్తంతో కుటుంబ పోషణ సాధ్యమవుతుందా అంటూ నిలదీశారు.
నిజానికి జీతాలు పెంచమంటూ ఇప్పటికీ చాలాసార్లు ధర్నాలు చేశారు వాలంటీర్లు. అయినా జగన్ పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు విడుదల చేసిన మేనిఫెస్టోలో కూడా తమ జీతాల విషయం ఎత్తకపోవడంతో సోషల్ మీడియా వేదికగా తమ బాధని వెళ్ళగక్కుతున్నారు వాలంటీర్లు. ఇప్పటికే వాలంటీర్లను రాజీనామా చేయించే పార్టీ ప్రచారానికి తిప్పుకోవాలని వైకాపా నేతలు నెల రోజుల నుంచి వారిపై ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. అయితే మెజారిటీ వర్గం వాలంటీర్లు వారి ప్రలోభాలకి తలొగ్గలేదు, ఎందుకు రాజీనామా చేయాలంటూ చాలామంది ఎదురు ప్రశ్నించారు.
కొందరు వాలంటీర్లు రాజీనామా చేసి ఏకంగా తెలుగుదేశం పార్టీలో చేరిపోవటంతో ఖంగు తినటం వైకాపా పార్టీ వంతయింది. 2, 66,000 మంది ఉన్న గ్రామ వాలంటీర్లలో ఇప్పటికే 60,000 మంది రాజీనామా చేసినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇతర రంగాలలో పనిచేసిన ఉద్యోగులకు ఈ ఐదేళ్ల కాలంలో ఎంతో కొంత జీతం పెరిగే ఉంటుంది కానీ తమ వేతనాలు పెరగటం లేదంటే గగ్గోలు పెడుతున్న వాలంటీర్ల పై కనీసం జాలి చూపటం లేదు వైసీపీ ప్రభుత్వం.
ఇదే సమయంలో కూటమి వాలంటీర్ల ఆవేదన అర్థం చేసుకుంది, వారు అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగించడంతోపాటు వారి వేతనాన్ని పదివేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చింది. ఏ ఉద్యోగము దక్కని పరిస్థితులలో కుటుంబ పోషణ కోసం వాలంటీర్ ఉద్యోగం చేస్తున్న వారికి పదివేల రూపాయలు జీతం భరోసాని ఇస్తుందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు చాలామంది వాలంటీర్లు.