Balayya: టాలీవుడ్ సీనియర్ నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీ గురించి అందరికీ తెలుసు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె పేరు బ్రాహ్మణి కాగా రెండో కుమార్తె పేరు తేజస్విని. కుమారుడి పేరు మోక్షజ్ఞ. అయితే వీరిలో నారా బ్రాహ్మణి వ్యాపారవేత్తగా రాణిస్తోంది. హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. అటు రాజకీయాలు, ఇటు సినీ నేపథ్యం ఉన్నా బ్రాహ్మణి మాత్రం వ్యాపార రంగంలో తనకుంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఆమె అక్కడి వరకే అందరికీ తెలుసు. కానీ ఆమె గురించి కొన్ని షాకింగ్ నిజాలు ఇటీవల బయటపడ్డాయి.
నారా బ్రాహ్మణిలో ఎన్నో నైపుణ్యాలు ఉన్నాయి. ఇటీవల లడాఖ్లో బైక్ రైడింగ్పై సాహసాలు చేసి తనలో తెలియని మరో కోణాన్ని అందరికీ చాటి చెప్పింది. ఆమెకు బైక్ రైడింగ్ చాలా ఇష్టం. ఒక ప్రొఫెషినల్ బైక్ రైడింగ్ గ్రూపులో మెంబర్గా ఉన్నారనే విషయం ఇప్పుడు అందరికీ తెలిసింది. సోషల్ మీడియాలో నారా బ్రాహ్మణి బైక్ రైడింగ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. యువ పారిశ్రామిక వేత్తలు, వివిధ సంస్థల సీఈవోలు సభ్యులుగా ఉన్న యంగ్ ప్రెసిడెంట్స్ ఆర్గనైజేషన్ ఇటీవల లడాఖ్లో ‘ది లద్దాఖ్ క్వెస్ట్’ పేరుతో ఓ సాహస యాత్ర నిర్వహించింది.
ఈ యాత్రలో పాల్గొన్న వారు తమ అనుభవాలను జావా యజ్డీ మోటార్ సైకిల్స్ పేరుతో షార్ట్ ఫిలింగా విడుదల చేశారు. ఇందులో నారా బ్రాహ్మణి బైక్ను నడుపుతూ చేసిన జర్నీతో అందరూ ఫిదా అయ్యారు. బ్రాహ్మణిలో మంచి టాలెంట్ ఉందంటూ ప్రశంసిస్తున్నారు. ఆమె నడిపిన బైక్ రంగు కూడా పసుపు కావడం విశేషం. బైక్ చాలా బరువుగా ఉన్నా సరే.. అంతదూరం ఆమె రైడ్ చేయడం గ్రేట్ అని కొనియాడుతున్నారు.
సేవారంగంలోనూ రాణిస్తున్న బ్రాహ్మణి
నారా బ్రాహ్మణి స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ డిగ్రీ పూర్తిచేసింది. చదువు పూర్తయ్యాక పలు సంస్థల్లో పనిచేసిన ఆమె.. ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొనసాగుతోంది. వ్యాపారంలోనే కాదు.. సమాజ సేవ చేయడంలో కూడా ముందుంటుంది. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ వేదికగా వివిధ రంగాలకు చెందిన పలువురికి సాయం చేస్తూ సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది.