AP Politics: ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో తమ పొత్తు తప్పనిసరి అని కుండలు బద్దలు కొట్టినట్టుగా చెబుతున్నాడు. తన పార్టీ సొంతంగా పోటీ చేసే అవకాశమే లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేస్తున్నాడు. ఇప్పటి వరకూ తనేదో సొంతంగా పోరాడినట్టుగా పవన్ చెప్పుకుంటూ ఉన్నాడు. అయితే ఈయన 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలతో కలిసి తిరిగాడు.
2019లో కమ్యూనిస్టులను, మాయవతి పార్టీని కలుపుకునే వెళ్లాడు. అయితే ఇదంతా చంద్రబాబు వ్యూహం మేరకే జరిగిందన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇలా పూర్తిగా చంద్రబాబు కు చంచాగిరి చేస్తున్నట్టుగా పవన్ కల్యాణ్ రాజకీయ గమనం సాగుతూ ఉంది. మరి ఇలాంటి పవన్ కల్యాణ్ ఇప్పుడు చంద్రబాబుతో డైరెక్టు పొత్తుతో రావడం పెద్ద విచిత్రం కాదు. ఇన్నాళ్లూ చంద్రబాబు ఇబ్బందుల్లో ఉన్నప్పుడల్లా ఇన్ డైరెక్టు గా ఆయన రెస్క్యూ కోసం పవన్ కల్యాణ్ వచ్చాడు. మరి ఏపీలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందనేది ఒక ఆసక్తిదాయకమైన రాజకీయ విశ్లేషణ.
ఈ రెండు పార్టీలూ వచ్చే ఎన్నికల్లో సీట్లను పంచుకుని బరిలోకి తొలి సారి దిగొచ్చు. అయితే 2014లోనే పవన్ కల్యాణ్ తెలుగు దేశానికి మద్దతు పలికాడు, 2019లో చంద్రబాబు వ్యతిరేక ఓటును చీల్చేందుకు పని చేశాడు. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చనివ్వను అంటున్నాడు. మరి ఎంత చీలనివ్వకపోయినా రాష్ట్రంలోని దాదాపు మూడో వంతు సీట్లలో టీడీపీ, జనసేనల పొత్తు ప్రభావం శూన్యం అని చెప్పక తప్పదు.రాయలసీమలో తమకు బలం లేదని పవన్ కల్యాణ్ తనే ప్రకటించాడు. మరి రాయలసీమ అంటే ఒక జిల్లానో, పదో పన్నెండు సీట్లో కాదు. ఏకంగా 52 అసెంబ్లీ సీట్ల పరిధిలో తమకు బలం లేదని పవన్ కల్యాణ్ ప్రకటించుకున్నాడు. మరి జనసేన అధినేతే తమకు బలం లేదని ప్రకటించుకున్న చోట జనసేనతో పొత్తు టీడీపీకి కొత్తగా ఉపయోగపడేదేమీ లేదని వేరే చెప్పనక్కర్లేదు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసొచ్చినా రాయలసీమలో వైసీపీదే హవా నడుస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. టిడిపి జనసేన పొత్తుతో వైసీపీకి భయం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.