Nandamuri Balakrishna: టీడీపీ సీనియర్ నాయకుడు హిందూపురం ఎంపీ నందమూరి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఈ యాత్ర కూటమి పార్టీల తరఫున చేస్తున్నారు. యాత్రలో భాగంగా ఆయన స్థానిక సమస్యల గురించి చర్చించడంతోపాటు వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు. మొదటి రెండు రోజులు సాధారణంగానే ప్రసంగించిన బాలకృష్ణ ఆ తరువాత ఇతర నాయకులకు భిన్నంగా వ్యవహరిస్తూ తనదైన శైలిలో పంచ్ డైలాగులు, సినిమా డైలాగులతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు దీంతో బాలయ్య ప్రసంగాలు ప్రజల్లోకి జోరుగా వెళుతున్నాయి.
ఈయన నందికొట్కూరు నియోజకవర్గం లో పర్యటించినప్పుడు చేసిన ప్రసంగం యూట్యూబ్ తో సహా సోషల్ మీడియాలో హైలెట్ గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు. నాకున్న జ్ఞానసంపదలో బ్రాహ్మణున్ని, ఐశ్వర్యంలో వైశ్యుడ్ని,మంచికి మాలను, ఎదురు తిరిగితే మాదిగను, కష్టాన్ని నమ్ముకునే కుమ్మరిని, కమ్మరిని, కంశాలిని, రజకున్ని..
నాయిబ్రాహ్మణుడిని, కల్మషం లేని యాదవుడిని,ఆపదలో ఆదుకునే వెలమను అని మీలో ప్రతి ఒక్కరు అనుకోవాలి అంటూ కూలాలన్నింటినీ కలుపుకుంటూ బాలకృష్ణ చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. ఓటుతోనే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి అంటూ బాలయ్య చేసిన ప్రసంగం ప్రజలనే కాదు సోషల్ మీడియాని కూడా ఉర్రూతలూగిస్తోంది. ఇతర నాయకుల ప్రసంగాలు విని బోర్ కొడుతున్న సాధారణ ప్రజలకు బాలయ్య ప్రసంగాలు కాస్త రిలాక్సేషన్ ఇస్తున్నాయి.
ఆయన ప్రసంగాలు యువతని ఆకట్టుకోవడంతో పాటు బాలయ్య ని ఓ రేంజ్ లో నిలబెడుతున్నాయి. ఏదైనా బాలయ్య రూటే సెపరేటు అనే సినిమా డైలాగు ఆయనకి రాజకీయాలలో కూడా బాగా వర్క్ అవుట్ అవుతుంది. అసలే బాలయ్య అంటే మాస్ ప్రజలకి దేవుడు ఇక ఈ ప్రసంగాలకి ఆకర్షితులయ్యారంటే బాలకృష్ణ లక్ష్యం నెరవేరినట్లే.