Rajasthan: సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నా.. ఇంకా కొంతమందిలో మాత్రం నేటికీ మార్పు రావడం లేదు. మూఢ నమ్మకాలు, బాల్యవివాహాలంటూ అమ్మాయిల జీవితాలను సగంలోనే తుంచేస్తున్నారు. అమ్మాయిలను అతి చిన్న వయస్సులోనే బాల్యవివాహాలు చేస్తూ అమ్మాయిలు ఎదుగుదలను అడ్డుకుంటున్నారు. కానీ.. ఓ అమ్మాయి మాత్రం తన లక్ష్యానికి అడ్డువస్తున్న వారితో పోరాడి గెలిచిన ఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది.
రాజస్థాన్లోని జోధ్సూర్ కు చెందిన రేఖ అనే అమ్మాయికి చిన్నప్పుడు తన తాత చనిపోవడంతో అదే గ్రామానికి ఓ అబ్బాయితో ఏడాది వయసులో వివాహం చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆమె అత్తమామలు ఆమెను ‘గౌన’ (వివాహానికి సంబంధించిన ఆచారం) కోసం ఒత్తిడి చేశారు. ఆమె అప్పుడు ఏఎన్ఎం ఉద్యోగం సాధించడానికి సిద్ధమవుతోంది. తాను కాపురానికి వెళ్తే తన లక్ష్యం నెరవేరదని భావించి అక్కడికి వెళ్లేందుకు నిరాకరించింది. ఇరు కటుంబ సభ్యులు ఎంత నచ్చజెప్పినా అస్సలు వెళ్లనని తెగేసి చెప్పింది. తర్వాత ఆమె సారథి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అనే ఎన్జీవోను సంప్రదించి వారి సహకారంతో కోర్టులో పిటీషన్ వేసింది.
మొదట్లో లొంగిపోవడానికి ఇష్టపడని ఆమె అత్తమామలు కుల పంచాయితీ పెట్టించి రేఖ కుటుంబ సభ్యులకు .10 లక్షల నగదు జరిమానా విధించారు. అంతటితో ఆగకుండా ఆ బాలిక కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేశారు. రేఖ ఏ మాత్రం భయపడకుండా మళ్లీ కోర్టును ఆశ్రయించింది. గురువారం కుటుంబ న్యాయస్థానం ప్రిసైడింగ్ అధికారి ప్రదీప్ కుమార్ మోదీ రేఖకు ఏడాది క్రితం చేసిన వివాహాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
వందేళ్ల నుంచి బాల్య వివాహాల దురాచారాన్ని రూపుమాపలేదని..ఇప్పుడు అందరూ కలిసి బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేయాలని ఆయన జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. న్యాయస్థానం తీర్పుతో ఆనందం వ్యక్తం చేసిన రేఖ, ఇది ఒక కల నిజమైందని.. ఇప్పుడు తాను ఏఎన్ఎం కావడంపై దష్టి సారిస్తానని పేర్కొంది. ‘ఈరోజు నా పుట్టినరోజు.. ఈ రోజు నాకు 21 ఏళ్లని ఈ వివాహం రద్దు నాకు.. నా కుటుంబానికి పుట్టినరోజు బహుమతిగా వచ్చింది’ అని ఆమె తనకు సహకరించిన ట్రస్ట్, న్యాయస్థానానికి ప్రత్యేక కతజ్ఞతలు తెలిపింది.