Alekhya Reddy: నందమూరి తారకరత్న మరణం టాలీవుడ్ అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది. యావత్ సినీ ప్రపంచం ఆయన మరణాన్ని తలుచుకుని శోకసంద్రంలో మునిగిపోయింది. తారకరత్న మరణంతో ఆయన భార్య అలేఖ్య రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పుట్టినరోజుకు మూడు రోజుల ముందే ఆయన కన్నుమూయడం అందరినీ కంటతడి పెట్టించింది.
అతి పిన్న వయసులోనే నందమూరి తారకరత్న మరణించడంతో కుటుంబ సభ్యుల్లో తీరని వేదన మిగిల్చింది. అభిమానులు శోకంలో మునిగిపోయారు. భర్తని కోల్పోవడంతో తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి తీవ్ర విషాదంలో ఉంది. అలేఖ్య, తారకరత్న ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. తన భర్త కోసం అలేఖ్య రెడ్డి ఇప్పటికీ రోధిస్తూనే ఉంది. తాజాగా అలేఖ్య రెడ్డి చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ అందరి హృదయాల్ని కలచి వేస్తోంది.
తారకరత్నతో చివరగా దిగిన ఫోటోని అలేఖ్య సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫోటోకి ఆమె చేసిన కామెంట్స్ ఎంతో ఎమోషనల్గా ఉన్నాయి. చివరగా తిరుమలకి వెళ్ళినప్పుడు ఆలయం వద్ద తారక రత్న, అలేఖ్య రెడ్డి తమ ముగ్గురు పిల్లలతో ఫోటో దిగారు. ఆ ఫోటోనే అలేఖ్య అభిమానులతో పంచుకుంది.
ఇదే మా చివరి ఫోటో అని, తలుచుకుంటుంటే నా హృదయం బద్దలవుతోంది. ఇదంతా కల అయితే బాగుంటుంది. నీ వాయిస్తో అమ్మ బంగారు అంటూ లేపవా అంటూ ఎంతో బాధతో అలేఖ్య రెడ్డి ఈ పోస్ట్ పెట్టింది. నెటిజన్లు కూడా అలేఖ్య రెడ్డికి మనో ధైర్యం చేకూరాలని కోరుకుంటున్నారు. ఏ సంబంధం లేని మాకే ఇంత బాధగా ఉంటే, ఆయన భార్యగా మీకు ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగలం అని కామెంట్స్ పెడుతున్నారు.