Aravinda Yadav Vs Inturi Nageswara Rao: ప్రకాశం జిల్లా కందుకూరు నియోజవర్గంలో ఈ సారి ఆసక్తికర పోరు ఉండబోంతుంది. ఒకప్పటి టీడీపీ కంచుకోటలో ఆ నియోజవర్గం ఒకటి. కానీ, గత ఇరవై ఏళ్లుగా అక్కడ తెలుగు దేశం పార్టీ వరుస పరాజయాలను చూస్తుంది . 2004 తరువాత అంటే వరుసగా నాలుగు సార్లు అక్కడ టీడీపీ ఓడిపోయింది. అయితే, ఈ సారి మాత్రం ఎలాగైనా గెలవాలని టీడీపీ భావిస్తుంది.
కందుకూరులో ఐదు దశాబ్ధాలుగా మానుగుంట మహీధర్ రెడ్డి, డాక్టర్ శివరాం మధ్య ఆదిపత్యపోరు కొనసాగుతూ వచ్చింది. కానీ, ఈసారి మాత్రం సీన్ మారిపోయింది. రెండు పార్టీలు కూడా కొత్తవారిని తెరపైకి తీసుకొని వచ్చాయి. పెంచలయ్య యాదవ్ కుమార్తె అరవింద యాదవ్కు జగన్ టికెట్ ఇచ్చారు. చంద్రబాబు ఇంటూరి నాగేశ్వరరావుకు టికెట్ ఇచ్చారు. దీంతో.. ఇప్పుడు అక్కడ రెడ్డి వర్సెస్ యాదవ్ గా పోరు మారిపోయింది.
కందుకూరు టీడీపీ నుంచి ఇంటూరి నాగేశ్వరరావు, ఇంటూరి రాజేష్ టిక్కెట్ ఆశించారు. అయితే చివరికి టీడీపీ అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావును టీడీపీ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో అప్పటి నుంచి ఇంటూరి రాజేష్ ఇక్కడ టీడీపీ రెబల్ అవతారం ఎత్తారు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన తనకు టికెట్ ఇవ్వలేదనే కారణంతో కందుకూరు నుంచి టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలో దిగేందకు సిద్ధం అయ్యారు. కానీ.. ఇంటూరి నాగేశ్వరరావుకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ శివరాం మద్దతు ఉంది. ఓ రకంగా చెప్పాలంటే.. ఆయన మద్దతుతోనే నాగేశ్వర్ రావు టికెట్ సంపాదించుకోగలిగారు. శివరాం మద్దతతో నాగేశ్వర్ రావు టీడీపీ కేడర్ మొత్తాన్ని తనతోనే ఉండేలా జాగ్రత్తపడ్డారు.
ఇది ఇలా ఉండగా వైసీపీలో కూడా కందుకూరు పరిస్థితి ఆసక్తికరంగా మారింది. మహీధర్రెడ్డి ఇక్కడ నుంచి మరోసారి టికెట్ ఆశించారు. కానీ, జగన్ మాత్రం అరవింద యాదవ్కు టికెట్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే జగన్.. కందుకూరు ఎమ్మెల్యే మహీధర్రెడ్డిని పిలిచి మీకు టికెట్ ఇవ్వడం లేదని.. వేరే వారిని పెడుతున్నామని చెప్పారు. ఆ అభ్యర్థిని గెలిపించుకురండి, మీకు పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. అయితే ఆ మాట వినగానే నేరుగా తన నియోజకవర్గంలో నిర్మాణమవుతున్న రామాయపట్నం పోర్టు నిర్వాసితులతో కలిసి పోర్టు కార్యాలయం ముందు మహీధర్రెడ్డి నిరసనకు దిగారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలంటూ నినదించారు. ఆరోజే ఆయనకు టికెట్ ఇవ్వరని తేలిపోయింది. అయితే, విజయసాయి రెడ్డి జోక్యంతో మహిధర్ రెడ్డి సైలంట్ అయ్యారు కానీ.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎంతవరకు సహకరిస్తారో అనేది చెప్పలేం. మహిధర్ రెడ్డి మద్దతు లేకుండా కందుకూరులో వైసీపీ గెలుపు సాధ్యం కాదు.
ఈ సారి ఎలాగైనా గెలవాలనుకుంటున్న టీడీపీ ఆశలు ఈసారి నిజమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి.
కందుకూరు నియోజకవర్గం జిల్లాల పునర్విభజన లో నెల్లూరు జిల్లాలో చేరింది.1994 నుంచి 2004 వరకు వరుసగా రెండు సార్లు ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా దివి శివరాం విజయం సాధించారు. అయితే అప్పటి నుంచి రెండు సార్లు కాంగ్రెస్, రెండు సార్లు వైసీపీ గెలిచాయి. ఇరవై ఏళ్లుగా టీడీపీ జెండా అక్కడ ఎగురలేదు. వరుసగా రెండు సార్లు గెలవడంతో వైసీపీపై సహజంగానే వ్యతిరేత ఉంటుంది. దానికి తోడు ఓ సెంటిమెంట్ కందుకూరులో కనిపిస్తుంది. వరుసగా టీడీపీ రెండు సార్లు, కాంగ్రెస్ రెండు సార్లు, వైసీపీ రెండు సార్లు గెలిచాయి. కాబట్టి మరోసారి వైసీపీ గెలిచే అవకాశం కనిపించడం లేదని స్థానికులు అంటున్నారు.