Bandi Sanjay: మునుగోడు ఉపఎన్నికలో ఓటమిపై కేంద్ర బీజేపీ అధిష్టానం సీరియస్గా ఉంది. జాతీయ నాయకులు వచ్చి ప్రచారంలోకి దిగినా ఎందుకు ఓడిపోయిందనే దానిపై బీజేపీ పోస్టుమార్టం చేసింది. బండి సంజయ్ సరిగ్గా పట్టించుకోలేదని, ప్రచారంలో వైఫల్యం చెందినట్లు గుర్తించినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ కు ఉద్వాసన పలికేందుకు అధినాయకత్వం సిద్దమైనట్లు వార్తలొస్తున్నాయి.
తెలంగాణలో బీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడిని బీజేపీ నియమించనుందట. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డీకే అరుణలలో ఒకరి పేరును హైకమాండ్ పరిశీలిస్తోన్నట్లు చెబుతున్నారు. తాజాగా ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డీకే అరుణకు హైకమాండ్ నుంచి సడెన్ గా పిలుపు వచ్చింది. దీంతో వాళ్లు ఢిల్లీ బయలుదేరారు. దీంతో ఈ ముగ్గురిలో ఒకరికి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి దక్కడం ఖాయమని తెలుస్తోంది.
ఇటీవల బీజేపీ పలు సర్వేలు చేయించిందట. ఈ సర్వేలలో గ్రామస్థాయిలో చాలామందికి బండి సంజయ్ పేరే తెలియదట. అంతేకాకుండా ఇటీవల ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో యాదాద్రిలో తడిబట్టలతో బండి సంజయ్ ప్రమాణం చేయడంపై కూడా బీజేపీ అధిష్టానం గుర్రుగా ఉంది. మునుగోడు ఉపఎన్నికల సమయంలో అది అసందర్బమని, చేయకుండా ఉండాల్సిందని బీజేపీ భావిస్తోందట. ఇక కార్యకర్తలను సమన్వయం చేసుకోవడంతో, నేతలతో టచ్ లో ఉండటంలో బండి సంజయ్ పనితీరు బాగాలేదని హైకమాండ్ భావిస్తోందట. దీంతో ఆయనను మార్చి వేరేవారికి అధ్యక్ష పదవి కట్టబెట్టే ఆలోచనలో కేంద్ర బీజేపీ అధినాయకత్వం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వస్తుందని చెబుతున్నారు.