Virat Kohli: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడా..? అందువల్లే బంగ్లాదేశ్ మ్యాచ్ ఓడిపోయిందా..? అంటే అవుననే అంటున్నాడు ఆ జట్టు వికెట్ కీపర్ నురుల్ హసన్. అడిలైడ్ ఓవల్ వేదికగా బుధవారం భారత్-బంగ్లాదేశ్ మధ్య ముగిసిన ఉత్కంఠపోరులో కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడని, అంపైర్లు దానిని గమనించలేదని.. ఒకవేళ వాళ్లు చూసి ఉంటే తమకు అదనంగా ఐదు పరుగులు వచ్చేవని వాపోయాడు. బుధవారం మ్యాచ్ ముగిసిన తర్వాత హసన్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అసలేం జరిగిందంటే..
ఇండియా-బంగ్లాదేశ్ మధ్య బుధవారం ముగిసిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ఎదుట 185 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ తొలుత దూకుడుగా ఆడింది. ఓపెనర్ లిటన్ దాస్ (27 బంతుల్లో 60) వీరవిహారం చేశాడు. పేసర్లు భారీగా పరుగులివ్వడంతో టీమిండియా సారథి రోహిత్ శర్మ.. స్పిన్నర్ అక్షర్ పటల్కు బంతినిచ్చాడు.
వీడియో లింక్ :
https://twitter.com/theranjanmayank/status/1588056220757536768
ఏడో ఓవర్ వేసిన అక్షర్ పటేల్ బౌలింగ్ లో లిటన్ దాస్ కవర్ దిశగా షాట్ ఆడాడు. తొలి పరుగు పూర్తయింది. కానీ రెండో పరుగు తీసే క్రమంలో అర్ష్దీప్ సింగ్ బంతిని దినేశ్ కార్తీక్ వైపు విసిరాడు. అదే సమయంలో ఇన్సైడ్ రింగ్ లో ఉన్న కోహ్లీ.. తాను బంతిని అందుకోనప్పటికీ నాన్ స్ట్రైకర్ వైపు త్రో చేసినట్టు యాక్షన్ ఇచ్చాడు. అయితే దీనిని అంపైర్లు గుర్తించలేదు. నురుల్ హసన్ ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావించాడు.
నిబంధనలు ఏం చెబుతున్నాయి..?
ఐసీసీ నియమావళి 41.5 ప్రకారం ‘ఒక బ్యాటర్ ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, మోసం చేయడం గాని చేయకూడదు. అలా జరిగితే అంపైర్లు నిబంధనల ప్రకారం సదరు బాల్ ను డెడ్ బాల్ గా ప్రకటించడంతో పాటు బ్యాటింగ్ జట్టుకు ఐదు పరుగుల రూపంలో పెనాల్టీ రూపంలో ఇవ్వొచ్చు..’ అని ఉంది. అయితే ఈ మ్యాచ్ లో అంపైర్లు గానీ బంగ్లాదేశ్ బ్యాటర్లు గానీ దీనిని గుర్తించకపోవడంతో కోహ్లీతో పాటు భారత్ కూడా బతికిపోయింది. చూసుంటే బంగ్లాకు అదనంగా ఐదు పరుగులు వచ్చి ఉండేవి. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఓడింది కూడా ఐదు పరుగుల తేడాతోనే కావడం గమనార్హం.