KCR – Etela Rajender: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా పాలనను విస్మరించి కేవలం ప్రగతి భవన్ లేదా ఫాంహౌస్కే పరిమితమవుతున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. యాదగిరిగుట్టలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడవ ప్రజా సంగ్రామ యత్ర సందర్భంగా నిర్వహించిన సభలో ఈటల పాల్గొని మాట్లాడారు.
సీఎం కేసీఆర్, దళితుల అసైన్డ్ భూములన్నీ లాక్కొని వారి నోట్లు మట్టి కొడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో కేవలం టీఆర్ఎస్ పాలన కొనసాగాలన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఉందని ఆరోపించారు. సీఎం కొడుకు కేటీఆర్ను సీఎం చేయడమే లక్ష్యంగా కేసీఆర్ యత్నిస్తున్నారన్నారు. రాష్ట్రంలో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేయడమే లక్ష్యం పెట్టుకున్నారన్నారు.
సామాజిక న్యాయం లేదు..
కేసీఆర్ పానలో సామాజకి న్యాయం లేదని ఢిల్లీలో చక్రం తిప్పడం కాదు.. ఉన్న సీఎం పదవి కూడా ఊడిపోతోందని ప్రస్తుతం టీఆర్ఎస్లో కొనసాగుతున్న సగం మంత్రులు తెలంగాణ వద్దన్నే వాళ్లేనని ఆరోపించారు. 8 ఏళ్ల పాలనలో ప్రధాని మోదీ ఏ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని అదే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరోజు కూడా సచివాలయానికి రాలేదన్నారు. ఫారెస్టు భూముల పేర్లతో దళితుల భూములు లాక్కుంటున్నారని కేసీఆర్ను గద్దె దించే వరకూ బీజేపీ పోరాడుతూనే ఉంటుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే భ్రమలో ఉన్నారని కాంగ్రెస్కు మూలమైన ఉత్తరప్రదేశ్లో కేవలం రెండే సీట్లు రావడం కాంగ్రెస్కు ఉన్న బలం అర్థమవుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వచ్చే ఆలోచనలో ఉన్నారని ఆ రోజు త్వరలోనే రానున్నట్లు ఈటల చురకలంటించారు.