Munugode By-Poll: మునుగోడు ఉపఎన్నికను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ గెలిచేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అందివచ్చిన అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటోంది. మునుగోడులో గెలిచి రాష్ట్రంలో టీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు బీజేపీ సర్శశక్తులు ఒడ్డుతోంది. మునుగోడు ఉపఎన్నికల క్రమంలో జాతీయ నేతలు కూడా తెలంగాణలో పర్యటిస్తున్నారు. నెలకో కేంద్రమంత్రి వచ్చి తెలంగాణలో పర్యటించి కేసీఆర్ సర్కార్ పై విమర్శలు చేస్తున్నారు. ఇక మునుగోడు ప్రచారానికి కూడా చాలామంది జాతీయ నేతలు వచ్చే అవకాశముంది.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ త్వరలో మునుగోడులో ప్రచారం నిర్వహించే అవకాశముంది. ఇక జేపీ నడ్డా, అమిత్ షా కూడా మునుగోడులో ప్రచారానికి దిగే అవకాశముంది. బీజేపీ ఇప్పటికే ఇంచార్జ్ లను ప్రకటించి మునుగోడులో రంగంలోకి దింపింది. మండలాల వారిగా ఇంచార్జ్ లను ప్రకటించింది. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడం, ఇంటింటి వెళ్లి ప్రచాంర చేయించడం ఇంచార్జ్ ల బాధ్యత. ఇక త్వరలో రాష్ట్ర బీజేపీ నేతలందరూ మునుగోడులోనే మకాం వేయనున్నారు. రాజగోపాల్ రెడ్డి తరపు ప్రచారం చేయనున్నారు.
అయితే మునుగోడు నియోజకవర్గం హైదరాబాద్ కు చాలా దగ్గర కావడంతో చాలామంది చదువుల కోసం, ఉద్యోగం కోసం, ఇతరత్రా పనుల కోసం భాగ్యనగరానికి వలస వచ్చి ఇక్కడే సెటిట్ అయ్యి ఉంటారు. ముఖ్యంగా ఎల్బీ నగర్ లో మునుగోడు నియోజకవర్గానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉన్నారు. వారికి మునుగోడులోనే ఇప్పటికీ ఓటు హక్కు ఉంది. కానీ ఎల్బీ నగర్ లోనే అద్దె ఇళ్లల్లో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. దీంతో ఎల్బీ నగర్ పరిధిలోని మునుగోడు ఓటర్లపై బీజేపీ ఫోకస్ పెట్టింది. వారితో సీక్రెట్ సమావేశాలు నిర్వహిస్తుంది. ఇటీవల ఓ పంక్షన్ హల్ లో మునుగోడు ఓటర్లతో బీజపీ సమావేశమైంది. వారి ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.
అలాగే మూడు దఫాలుగా మునుగోడు ఓటర్లతో ఎల్బీ నగర్ లో బీజేసీ సమావేశాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. హయత్ నగర్ లో రెండు రోజులు ఒకసారి బీజేపీ మునుగోడు ఓటర్లతో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక బీజేపీ నేతలు మునుగోడు ఓటర్లను గుర్తించి వారితో టచ్ లో ఉంటున్నారు. ఇక కాంగ్రెస్, టీఆర్ఎస్ మాత్రం ఎల్బీ నగర్ లోని మునుగోడు ఓటర్లపై అంతగా దృష్టి పెట్టడం లేదు. మునుగోడులో జరిగిన ప్రచార సభలో ఎల్బీ నగర్ లో మునుగోడు ఓటర్లు ఎక్కువ మంది ఉన్నట్లు వ్యాఖ్యానించారు. కానీ స్థానిక కాంగ్రెస్ నేతలు మాత్రం వారిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు.
ఇక అధికార టీఆర్ఎస్ కూడా ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని మునుగోడు ఓటర్లను లైట్ తీసుకుంది. ఓటర్లను గుర్తించి వారితో చర్చలు జరపే ప్రయత్నాలు టీఆర్ఎస్ చేయడం లేదు. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లో చేరారు. ఆయన కూడా పట్టించుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు మునుగోడు ఓటర్లతో ఆయన ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు. దీంతో బీజేపీ మునుగోడు ఓటర్లను గుర్తించి వారిని ఆకర్షించడంతో ముందంజలో ఉంది.